Srinivas goud On tickets Issue
Srinivas goud On tickets Issue: భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల విషయంలో వివాదం రాజుకోవడం, టికెట్ల కోసం అభిమానులు సికింద్రాబాద్ లోని జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ విషయంపై సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్వాహకులు ఇందులో పాల్గొని అన్ని విషయాలను మంత్రికి చెప్పారు. టికెట్ అమ్మకాల అవకతవకలపై కూడా మంత్రి నిలదీశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… టికెట్ల అమ్మకాలు పారదర్శకంగా జరగాలని ఆదేశించామని అన్నారు.
టికెట్ల అమ్మకాల విషయంలో హెచ్సీఏ పూర్తిగా విఫలమైందని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బ్లాక్ లో టికెట్లు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ ఈవెంట్ అయినా పారదర్శకంగా అవినీతిరహితంగా జరగాలన్నదే లక్ష్యమని తెలిపారు. టికెట్ల అమ్మకాల బాధ్యత హెచ్సీఏదేనని అన్నారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి ఉచిత వైద్య సేవలు అందిస్తామని అన్నారు.
టికెట్ల విక్రయాల గురించి తమకు ముందే చెప్పి ఉంటే మెరుగైన ఏర్పాట్లు చేసే వాళ్లమని తెలిపారు. హెచ్సీఏకి పాలకవర్గం లేదని అన్నారు. ప్రభుత్వం నుంచి దానికి సహకారం అందిస్తామని చెప్పారు. కరోనా తర్వాత జరుగుతున్న మ్యాచ్ కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉందని అన్నారు.