Telangana Rains : రెయిన్ అలర్ట్.. హైదరాబాద్సహా తొమ్మిది జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
Telangana Rains : తెలంగాణలో వచ్చే రెండుమూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
- Harish Thanniru
- Updated on- August 26, 2026 / 12:05 PM IST
Telangana Rains
Telangana Rains : తెలంగాణలో వచ్చే రెండుమూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావం కొనసాగుతోందని, ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
Also Read : Pan Masala Raid: హైదరాబాద్లో భారీ పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్.. వేల కిలోల పొగాకు స్వాధీనం
వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలో హైదరాబాద్ సహా తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ, ఉత్తర తెలంగాణలో చెదురుమదురు వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని,ఆయా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వర్షాలతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ లోనూ ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.. బుధవారం తెల్లవారు జామున కూడా వర్షం పడింది. అయితే, ఇవాళ మధ్యాహ్నం తరువాత పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో వేచిఉండొద్దని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అన్నదాతకు కాస్త ఊరట లభించనట్లయింది. విత్తనాలు నాటి వర్షం కోసం వేచిచూస్తున్న రైతులు.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
