రంగనాథ్‎పై వేటు.. హైడ్రాకు కొత్త బాస్.. హైకోర్టు ఆర్డర్స్

HYDRA Commissioner : హైడ్రా కమిషర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు ఊహించని షాకిచ్చింది. ఆయన్ను తక్షణమే తొలగించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

HYDRA Commissioner

HYDRA Commissioner : హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఆయన్ను వెంటనే హైడ్రా కమిషనర్‌గా తప్పించాలంటూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ధర్మాసనం సీఎస్ సంజయ్ జాజును ఆదేశించింది.

రంగనాథ్ స్థానంలో అర్హత కలిగిన అధికారిని నియమించాలని హైకోర్టు సూచించింది. సెక్రటరీ ర్యాంకు స్థానంలో ఉన్న ఉన్నతాధికారి ఇలా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఏవీ రంగనాథ్ 63 సార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అధికారిపై ఇన్ని ధిక్కరణ కేసులు ఎందుకు నమోదయ్యాయని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.

హైకోర్టుకు ఏవీ రంగనాథ్ క్షమాపణలు :
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలో సర్వే నంబర్ 1, 2లలో 40 ఎకరాల ల్యాండ్ సంబంధించి కోర్టు ధిక్కరణ కేసుపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణ సమయంలోనే హైడ్రా కమిషనర్ లోతుకుంట భూముల వ్యవహారంలో సారీ చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు.

కోర్టులు, దేశ న్యాయవ్యవస్థపై తనకు ఎంతో నమ్మకం, అత్యున్నత గౌరవం ఉందని పేర్కొన్నారు. ఈ భూముల వద్ద ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. పిటిషనరే అవాస్తవాలు చెప్పారంటూ ఆరోపించారు. ఈ పరిణామాలన్నింటికి తాను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు.