Hyderabad ORR Lease: 30ఏళ్లు లీజుకు ఓఆర్ఆర్.. హెచ్ఎండీఏకు భారీగా ఆదాయం..
ముంబైకి చెందిన ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 7,380 కోట్లకు టెండర్ను కైవసం చేసుకుంది. ఈ సంస్థ 30ఏళ్ల పాటు టీవోటీ పద్దతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది.
- Harishth Thanniru
- Published On : April 28, 2023 / 10:37 AM IST
Hyderabad Outer Ring Road
Hyderabad ORR Lease: భారీ ఆదాయంపై ఫోకస్ చేసిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డౌలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఎ) ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఒక్క టెండర్తో రూ. 7,380 కోట్లు రాబట్టింది. ప్రభుత్వం ప్రకటించిన భూ వేలం ద్వారా మంచి ఆదాయాన్ని రాబడుతున్న హెచ్ఎండీఏ.. రింగ్ రోడ్డును లాంగ్ లీజ్కు ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం రాబట్టింది. ఔటర్ రింగ్ రోడ్ను టోల్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) పద్దతిలో కేటాయించడం ద్వారా 6వేల కోట్లు ఆశిస్తే 7,380 కోట్లు ఆదాయం సమకూరింది. వచ్చిన ఆదాయం ద్వారా ఇతర ప్రాజెక్టులను చేపట్టేందుకు ఉపయోగిస్తుంది హెచ్ఎండీఏ.
హెచ్ఎండీఏ ఒకప్పుడు ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని అందించిన సంస్థ. మధ్యలో కొన్నేళ్లపాటు ఆర్థిక నష్టాలు ఎదుర్కొన్నా.. భూముల అమ్మకం ద్వారా భారీగా ఆదాయాన్ని రాబడుతోంది. వేలకోట్ల రూపాయలను రాబట్టేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఆదాయం సంపాదించే విధానంలో హెచ్ఎండీఏ విజయవంతం అయింది. గ్రేటర్ చుట్టూ 6,696 కోట్లు ఖర్చు పెట్టి ఎనిమిది లేన్లతో 158 కిలో మీటర్లు ఔటర్ రింగ్ రోడ్డును హెచ్ఎండీఏ డౌవలప్ చేసింది. 19 ఇంటర్ చేంచ్లు ఉన్న ఓఆర్ఆర్ పై ప్రతీరోజూ 1.75 లక్షలవాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతీరోజూ 1.16కోట్లు వస్తుండగా.. ఏడాదికి 421 కోట్ల వరకు టోల్ రూపంలో గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం వచ్చింది. ఏటా వాహనాల సంఖ్య పెరగడంతో పాటు ఆదాయంకూడా పెరుగుతూ వస్తోంది.
వచ్చే 30ఏళ్ల కాలానికి వసూలయ్యే మొత్తాన్ని ఒకేసారి లీజు ఫీజు తీసుకొని నిర్వహణ సంస్థలకు ఓఆర్ఆర్ను టీవోటీ విధానంలో అప్పగించేలా ప్రణాళిలు సిద్ధం చేసిన అధికారులు అందులో విజయవంతం అయ్యారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టును టోల్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) విధానంలో అప్పగించాలని నిర్ణయించిన తరువాత పనులు దక్కించుకున్న సంస్థకు ఎంతకాలం లీజుకు ఇవ్వాలి, టోల్ వసూళ్ల విధానం, లీజు సంస్థకు చేకూరే ఆదాయం, నిర్వహణ వ్యయం వంటి అంచనాలను స్టడీ చేసి టెండర్లను పిలిచారు. రెండు రౌండ్లు ఫ్రీ బిడ్ మీటింగ్ అధికారులు నిర్వహించారు. ఇందులో భాగంగా 11 సంస్థలు టెండర్లలో పాల్గొనగా.. అందులో నాలుగు సంస్థలు ఫైనాన్సియల్ బిడ్ కు అర్హత సాధించాయి.
Andhra Pradesh: ఏపీకి రజనీకాంత్, కడప జిల్లాలో గవర్నర్ పర్యటన.. ఏపీ రౌండప్
ముంబైకి చెందిన ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 7,380 కోట్లకు టెండర్ను కైవసం చేసుకుంది. ఈ సంస్థ 30ఏళ్ల పాటు టీవోటీ పద్దతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది. దీంతో హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ (హెచ్జీసీఎల్)కు నిర్వహణ భారం తప్పింది. ఇలాంటి పద్దతిలోనే నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఇండియా జాతీయ రహదారులను లీజుకు ఇవ్వడం ద్వారా ఒకేసారి ఆదాయం సమకూర్చుకుంటుంది. హెచ్ఎండీఏ అధికారులు కూడా అదే విధానాన్ని అనుసరించారు. భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ పెరగడం, టోల్ పెరుగుదల, ఇతర అంశాల్లో వచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని టీవోటీ పద్దతిలో ఔటర్ రింగ్ రోడ్డును హెచ్ఎండీఏ లాంగ్ లీజుకు ఇచ్చింది. కొత్త పద్దతిలో మంచి ఆదాయాన్ని ఆర్జించిన హెచ్ఎండీఏ అధికారులను సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తోపాటు పలువురు అభినందించారు. కొత్త విధానంతో మౌలిక వసతులు పెరగడంతో పాటు, కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు.
