IMD Good News: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రైతాంగానికి శుభవార్త చెప్పిన ఐఎండీ
రైతాంగానికి భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది..
- Harishth Thanniru
- Published On : April 16, 2025 / 08:54 AM IST
Kharif season
IMD Good News: రైతాంగానికి భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త చెప్పింది. నాలుగేళ్లుగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతాంగానికి ఊరట కల్పించేలా కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా వర్షాభావ పరిస్థితులు దాదాపుగా ఏర్పడకపోవచ్చునని అంచనా వేసింది.
Also Read: Gossip Garage: జనసేనలో చేరతారా, బీజేపీలోకి వెళ్తారా? ఎటూ తేల్చుకోలేకపోతున్న గ్రంథి.. కారణం అదేనా..
ప్రతీయేటా ఖరీఫ్ ప్రారంభంలో సరియైన వర్షాలు పడక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభంలో ఒకటిరెండు సార్లు పడిన వర్షాలకు రైతులు విత్తనాలు నాటుతుండగా.. ఆ తరువాత వర్షాలు మొఖం చాటేయడం, తద్వారా నాటిన విత్తనాలు మొలవక రైతులు నష్టపోతుండటం పరిపాటిగా మారింది. అయితే, ఐఎండీ ప్రకటనతో ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని తెలుస్తోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
తెలంగాణ రాష్ట్రంలో జూన్, జులై నెలల్లో రైతులు ఖరీఫ్ పంటల సాగును ప్రారంభిస్తారు. ప్రతీయేటా ఆ సమయంలో సరియైన వర్షాలు పడక రైతులు నష్టపోతున్నారు. అయితే, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల (జూన్ -సెప్టెంబరు) కాలంలో దేశ వ్యాప్తంగా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వానలే పడే అవకాశం ఉందని తెలిపింది.
1971 నుంచి 2020 వరకు ఉన్న గణాంకాల ఆధారంగా చూస్తే.. దేశవ్యాప్తంగా దీర్ఘకాలంలో సగటున 87 సెంటీమీటర్ల వర్షం కురుస్తూ వస్తోందని, ఇప్పుడు అందులో 105శాతం దాకా వర్షాలు పడొచ్చని భూ విజ్ఞాన శాస్త్ర శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెల్లడించారు. సాధారణానికి మించి, అధిక వర్షపాత అంచనాలు కలిపి చూస్తే మంచి వర్షాలకు 56శాతం అవకాశం ఉందని వివరించారు. ఈ ఏడాది ఎల్ నినో ఏర్పడే పరిస్థితులు లేవని, జూన్ – సెప్టెంబరు నెలల మధ్య ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సాధారణానికి మించి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
