International Women’s Day : అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి మీడియాకు తెలిపారు. మూడు రోజులు సంబరాలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. మార్చి 6, 7, 8 తేదీల్లో మహిళా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. 6వ తేదీ గ్రామంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీ కట్టడం, మహిళ ఉద్యోగులకు సన్మానం ఉంటుందన్నారు. మార్చి 7వ తేదీన కళ్యాణ లక్ష్మీ పథకంతో 10 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతుందన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా ఈ పథకం అమలు చేస్తున్న విషయాన్ని తెలిపారు. ఆరోగ్యలక్ష్మీ పథకం అమలు దేశంలో ప్రత్యేక పథకంగా అభివర్ణించారు మంత్రి సత్యవతి రాథోడ్.
Read More : Minister Srinivas Goud : అందుకే శ్రీనివాస్ గౌడ్ను చంపాలనుకున్నాను-రిమాండ్ రిపోర్ట్లో నిందితుడు
సీఎం కేసీఆర్ మహిళా బంధు పేరుతో మూడు రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, మహిళల కోసం ఎన్నో పథకాలు సీఎం కేసీఆర్ తెచ్చారన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియచేయడం జరుగుతుందని, మిషన్ భగీరథ పథకం ద్వారా మహిళలు నీటి కోసం బయటకు వెళ్లే అవసరం లేకుండా పోయిందన్నారు. మహిళా భద్రత కోసం సీఎం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు, రాష్ట్రంలో మహిళలకు షీ టీమ్స్ తో భరోసా కలిగిందన్నారు. పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని, విద్యార్థినిల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాజకీయంగా రిజర్వేషన్లు అమలు చేసి సీఎం ఎంతో మంది మహిళలకు అవకాశాలు కల్పించారన్నారు. ప్రతి రంగంలో మహిళలను సీఎం ప్రోత్సహిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.