Vande Bharat Express
Vande Bharat Express : సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును నల్లగొండ మీదుగానే నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత మూడు మార్గాలను అధ్యయనం చేశారు. బీబీనగర్, కాజీపేట, విజయవాడ మార్గం కన్నా ప్రస్తుతం నారాయణాద్రి రైలు వెళ్లే మార్గంలోనే వందేభారత్ రైలును నడిపేందుకు మొగ్గు చూపినట్లు సమాచారం. దీంతో సికింద్రబాద్, బీబీనగర్, నల్లగొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు గూడూరు, శ్రీకాళహస్తి మీదుగా రైలు తిరుపతికి వెళ్లనుంది.
ఇదే మార్గంలో పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం మీదుగా ఒంగోలు, నెల్లూరు, గూడూరు, కాళహస్తి మీదుగా సర్వే చేశారు. మొదటగా నారాయణాద్రి మార్గంలో పిడుగురాళ్ల వరకు నడిపి, అక్కడి నుంచి శావల్యాపురం వైపు మళ్లించే యోచన చేస్తున్నారు. ఈ వారంలోనే రూట్ కు సంబంధించి నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నెలాఖరున రైలును ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఇతర రైళ్లలో దాదాపు 12 గంటల సమయం పడుతుంది.
Vande Bharat train : సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ .. మరికొన్ని రోజుల్లోనే
వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రావడం ద్వారా 6 నుంచి 7 గంటల సమయంలో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విధంగా ట్రాక్ ల పటిష్టతను పరిశీలిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కనీస టికెట్ ధర రూ.1150 ఉండే అవకాశముంది. పూర్తిస్థాయి వివరాలు, రైలు నెంబర్ పై కసరత్తు చేస్తోన్నారు.