Revanth Reddy: నేను ఉన్నంతవరకు బీఆర్ఎస్ సర్కారును మళ్లీ రానివ్వను.. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్!
తెలంగాణ ప్రజా కవి, గాయకుడు అందెశ్రీ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో ‘అందెశ్రీ స్మృతివనం’ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) శనివారం భూమి పూజ చేశారు.
Cm Revanth Reddy sensational comments on BRS party at Ande Sri birth anniversary meeting
- అందెశ్రీ స్మృతివనానికి భూమి పూజ.
- బీఆర్ఎస్ పాలనపై సీఎం మండిపాటు.
- తొలి ఏడాదే ఉద్యోగాల భర్తీ.
Revanth Reddy: తెలంగాణ ప్రజా కవి, గాయకుడు అందెశ్రీ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో ‘అందెశ్రీ స్మృతివనం’ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. అందెశ్రీ దొరల గడీల ముందు మోకరిల్లని ధైర్యవంతుడని కొనియాడారు. ఆయన తనకు ఆత్మబంధువని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందెశ్రీని తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని, ప్రజా గాయకుడు గద్దర్ను సైతం ప్రగతిభవన్ గేటు బయట ఎండలో నిలబెట్టి అవమానించిందని విమర్శించారు. తెలంగాణ కవులను అవమానించినప్పుడే ఆ దొరల పాలనను సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు.
ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాల వ్యాఖ్యలపై సీఎం మండిపాటు:
కేసీఆర్ నోటిఫికేషన్లు ఇస్తేనే తాము ఉద్యోగాలు ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. గత పాలకుల హయాంలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణను గాలికొదిలేశారని, ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే దాదాపు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, నిరుద్యోగుల తల్లిదండ్రుల సాక్షిగా నియామక పత్రాలను అందజేశామని గుర్తుచేశారు. నిరుద్యోగుల భవిష్యత్తు గురించి గత ప్రభుత్వం ఎన్నడూ ఆలోచించలేదని దుయ్యబట్టారు.
కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు:
తెలంగాణ సమాజం కల్వకుంట్ల కుటుంబాన్ని శ్రీమంతులను చేస్తే, వారు మాత్రం రాష్ట్రాన్ని దోచుకున్నారని సీఎం ఆరోపించారు. కేసీఆర్ వేల ఎకరాల్లో, కేటీఆర్, హరీశ్రావు, కవిత వందల ఎకరాల్లో ఫామ్హౌస్లు కట్టుకున్నారని, వారు నిజాం రాజును మించిన ధనవంతులుగా ఎలా మారారని ప్రశ్నించారు. ప్రజలు వారిని క్షమించారని భ్రమపడవద్దని, తాను ఉన్నంతవరకు తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ సర్కారును రానివ్వనని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తే ఎదురించడానికి అందెశ్రీ మళ్లీ పాటై పుడతాడని సీఎం హెచ్చరించారు.
