MLC Kavitha-Delhi liquor scam: విచారణకు హాజరుకాలేనన్న కవిత.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ ఈడీ విచాణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో విచారణకు రాలేనని అన్నారు. ఈ నెల 24న తాను విచారణకు హాజరవుతానని తెలిపారు. ఇందుకు సంబంధించిన లేఖను ఆమె తన లీగల్ టీమ్ ద్వారా పంపారు. కాసేపట్లో ఆమె మీడియా ముందుకు రానున్నారు.
- T Venkateshwarlu
- Published On : March 16, 2023 / 12:06 PM IST
Kavitha-Delhi liquor scam
MLC Kavitha-Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ ఈడీ విచాణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, అలాగే, సుప్రీంకోర్టులో కేసు కారణంగా విచారణకు రాలేనని తెలిపారు. ఈ నెల 24న తాను విచారణకు హాజరవుతానని తెలిపినట్లు తెలుస్తోంది. (ఈడీ కార్యాలయంలో మహిళలను విచారించడంపై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న విషయం తెలిసిందే). ఇందుకు సంబంధించిన లేఖను ఆమె ఈడీకి తన లీగల్ టీమ్ సభ్యుడు భరత్ ద్వారా పంపారు. ఈడీ అడిగిన పలు పత్రాలనూ ఆమె భరత్ ద్వారా పంపించారు. కాసేపట్లో ఆమె మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
కవిత ఈ నెల 11న ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 11 గంటలకు మరోసారి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె లీగల్ టీమ్ తో చర్చించారు. ప్రస్తుతం కవిత ఢిల్లీ, తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసంలో ఉన్నారు. అక్కడకు పోలీసులు భారీగా చేరుకున్నారు. అలాగే, బీఆర్ఎస్ నేతలు కూడా భారీగా వచ్చారు.
కవితకు మద్దతుగా తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మరి కొందరు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. కేసీఆర్ నివాసం వద్ద ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ కూడా విధించడం గమనార్హం.
కవితను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చెలరేగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు, ఢిల్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయ ద్వారాన్ని పోలీసులు మూసేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఈడీ కార్యాలయాన్ని ముట్టడిస్తారేమేనని పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
