కాళేశ్వరం ఎత్తిపోతలపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పటి మంత్రివర్గ సమిష్టి నిర్ణయమని, క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అంటున్నారు. కాళేశ్వరం కట్టినప్పుడు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన, ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మాత్రం సరికొత్త వివాదాన్ని లేవనెత్తారు.
ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు అబద్ధాలు చెప్పారని, ఆయన చెప్పినట్లు మంత్రివర్గ ఉపసంఘానికి, కాళేశ్వరానికి సంబంధం లేదని తుమ్మల చెప్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. కాళేశ్వరంపై క్యాబినెట్ సబ్కమిటీ ఎప్పుడూ రిపోర్ట్ ఇవ్వలేదని, అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్కు మంత్రివర్గ ఆమోదమే లేదని కొత్త ఇష్యూ లేవనెత్తారు తుమ్మల నాగేశ్వరరావు. అయితే ఈటల, హరీశ్రావు, కేసీఆర్తో సహా అందరినీ విచారణకు పిలిచి..అప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్గా ఉన్న తుమ్మల పీసీ ఘోష్ కమిషన్ ఎందుకు వివరణ కోరడం లేదన్న విమర్శల నేపథ్యంలో..తుమ్మల కొత్త ట్విస్ట్ ఇచ్చారు.
ఈటల, హరీశ్ రావుతో పాటు తాను సభ్యుడిగా ఉన్న క్యాబినెట్ సబ్ కమిటీ కాళేశ్వరంపై ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదని మంత్రి తుమ్మల చెప్పడంతో కథ కొత్త టర్న్ తీసుకుంటోంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మంత్రివర్గం దగ్గరకు రాలేదని.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో మాత్రమే పనులు జరిగాయని తుమ్మల బాంబ్ పేల్చడం చూస్తుంటే..ఇష్యూ కొత్త మలుపు తిరిగినట్లే కనిపిస్తోంది.
కాళేశ్వరం నిర్మాణం చేపట్టిన మూడేళ్ల తర్వాత సవరించిన అంచనాలు మాత్రమే క్యాబినెట్ ముందుకు వచ్చాయని తుమ్మల అంటున్నారు. క్యాబినెట్ ఉమ్మడి నిర్ణయమని హరీశ్ రావు చెప్పడం సరికాదన్న తుమ్మల..దానికి సంబంధించిన జీవోలు, ఆనాడు క్యాబినెట్ సబ్ కమిటీగా తామిచ్చిన రిపోర్టులన్నీ తన దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఇంతటితో ఆగకుండా జస్టిస్ ఘోష్ కమిషన్ తనను పిలవకున్నా వెళ్లి వివరాలు ఇస్తానంటూ కొత్త చర్చకు తెరలేపారు తుమ్మల నాగేశ్వరరావు.
కాంగ్రెస్ ప్రభుత్వం మీదే కంప్లైంట్
మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన మాజీమంత్రి హరీశ్రావు..కాంగ్రెస్ ప్రభుత్వం మీదే కంప్లైంట్ చేశారట. తాము కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చామో..ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలో ప్రాజెక్టును ఎలా నిర్లక్ష్యం చేస్తుందో వివరించారట.
అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంను కూల్చే కుట్ర చేస్తుందని..ఎందుకు పనికి రాకుండా చేయాలని చూస్తోందని కూడా చెప్పారట. డ్యామేజ్ జరిగిన చోట రిపేర్ చేస్తే నీళ్లు ఎత్తిపోయొచ్చని..కానీ కావాలని తమను బద్నాం చేయడం కోసం..అవినీతి మరక వేయడం కోసం..కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేస్తుందని వివరించారట హరీశ్.
క్యాబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని తుమ్మల అంటున్నారు. హరీశ్రావు ఏమో తప్పంతా కాంగ్రెస్దే అని అటాక్ చేస్తున్నారు. ఈటల రాజేందర్ అయితే క్యాబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం జీవోలు వచ్చాయి..సబ్ కమిట్ రిపోర్ట్ బేస్డ్గానే కట్టారని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాళేశ్వరం కమిషన్ నెక్స్ట్ ఏం చేయబోతుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. కాంగ్రెస్ నేతలను కూడా పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ కూడా కోరనుందట కాళేశ్వరం కమిషన్. మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేయకపోవడానికి రీజనేంటో తెలుసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. అంతేకాదు తుమ్మల తన దగ్గర ఉన్న వివరాలు ఇస్తే కాళేశ్వరం కమిషన్ విచారణ కోణం మారే చాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అసలు క్యాబినెట్ ఆమోదమే లేదన్న ఆయన మాటలు నిజమైతే..కమిషన్ విచారణ ఎప్పట్లో తేలకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాళేశ్వరం విచారణ ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.