kalvakuntla Kavitha : లక్ష్మీ నరసింహస్వామి, నా ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. మండలిలో కవిత లాస్ట్ స్పీచ్ హైలైట్స్..
kalvakuntla Kavitha : తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రసంగం చేశారు. ఇదే తన చివరి ప్రసంగమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
- Harishth Thanniru
- Published On : January 5, 2026 / 02:09 PM IST
kalvakuntla Kavitha
kalvakuntla Kavitha : తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రసంగం చేశారు. ఇదే తన చివరి ప్రసంగమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన రాజీనామాను ఆమోదించాలని శాసనమండలి చైర్మన్ ను కోరారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని.. బలమైన శక్తిగా మళ్లీ చట్ట సభల్లోకి వస్తానంటూ కవిత అన్నారు.
Also Read : kalvakuntla Kavitha : కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన కల్వకుంట్ల కవిత..
శాసనమండలిలో కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఉద్యమకారులకు పెన్షన్ ఇద్దామంటే ఇవ్వలేదని కవిత అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా గండికొట్టారని కవిత విమర్శించారు. ఇసుక దందాలో అక్రమాలతో నేరళ్ల దురాఘతాలకు పాల్పడ్డారని అన్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చటాన్ని తాను అంగీకరించలేదన్న కవిత.. తెలంగాణలో ఏం చేశామని నేషనల్ పార్టీ పెడతాంమని ప్రశ్నించానని చెప్పారు.
కేసీఆర్ మీద కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టిందని, ఆ సమయంలో బీఆర్ఎస్ నాయకులు తనకు అండగా నిలవలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిగా మూడేళ్లు ఈడీ, సీబీఐలతో తాను పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ మూడేళ్లు నన్ను పట్టించుకోలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ మీద ఘోష్ కమిటీ వేస్తే ఎవరూ మాట్లాడలేదు.. సీబీఐ విచారణ వేస్తామంటే ఎవరూ మాట్లాడలేదు.. హరీశ్ అవినీతి గురించి చెబితే నన్ను సస్పెండ్ చేశారంటూ కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం ఒక జోక్ అంటూ మండలి వేదికగా కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పద్దతి లేని పార్టీకి దూరమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నా సస్పెన్షన్ ను కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గా వాడుకోవాలనుకుంది. కానీ, నేను మళ్లీ చెబుతున్నా.. లక్ష్మీ నరసింహస్వామి, నా ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నాది ఆస్తుల పంచాయతీ కాదు. ఆత్మగౌరవ పంచాయతీ
అంటూ కవిత స్పష్టం చేశారు.
మహిళలకు న్యాయం జరగాలంటే పార్టీల రాజ్యాంగం మార్చాలి. బీఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తే ప్రజలు మీకు కూడా బుద్ధి చెబుతారంటూ కవిత అన్నారు. శాసనమండలిలో ఇదే తన చివరి ప్రసంగం.. ఇప్పుడు ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నా.. బలమైన శక్తిగా మళ్లీ చట్ట సభల్లోకి వస్తానంటూ కవిత శపథం చేశారు.
