కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎంపీ కె.కేశవరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్లో చేరుతున్న నేపథ్యంలో రాజ్యసభకు అవసరమైతే రాజీనామా చేస్తానని, కాంగ్రెస్ మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తే స్వీకరిస్తానని తెలిపారు.
కేసీఆర్ను కలిసినప్పుడు కొన్ని రోజులు ఆగితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు. తన కొడుకు విప్లవ్ మంచి నిర్ణయమే తీసుకున్నారని తెలిపారు. తన కూతురు విజయలక్ష్మి మాత్రం రేపు కాంగ్రెస్లో చేరుతారని చెప్పారు. తాను 55 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నానని తెలిపారు. ఎవ్వరికీ ఇవ్వని పదవులను కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిందని అన్నారు.
తాను ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి, పీసీసీ, సీడబ్ల్యూసీ మెంబెర్గా కాంగ్రెస్ అనేక అవకాశాలు ఇచ్చిందని చెప్పారు. తాను ఇందిరాగాంధీ హయాంలో మంత్రిని అయ్యానని తెలిపారు. పార్లమెంట్లో బిల్ పాస్ కావడం వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పారు. అందుకు కాంగ్రెస్ కారణమని తెలిపారు. తెలంగాణ కోసమే తానేను టీఆర్ఎస్లోకి వెళ్లానని చెప్పారు.
అదే బీఆర్ఎస్ ఓటమికి కారణం
బీఆర్ఎస్ను ఒక కుటుంబం నడిపిస్తుందన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని అన్నారు. అదే బీఆర్ఎస్ ఓటమికి కారణమని తెలిపారు. 13 ఏళ్ల తీర్థయాత్ర తరువాత సొంత ఇంటికి వెళ్లాలని పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తెలిపారు. ఇండియా గ్రూప్లో చేరాలని కేసీఆర్ కు చెప్పానని, కానీ వినలేదని అన్నారు. అందరం కలిసికట్టుగా బీజేపీతో పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Also Read: బీఆర్ఎస్ అలర్ట్.. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య?