తెలంగాణలో పొత్తులపై కుండబద్దలు కొట్టినట్లు క్లారిటీ ఇచ్చేసిన కిషన్ రెడ్డి
సూర్యుడు పడమర దిక్కున ఉదయించడం అనేది ఎంత అవాస్తవమో, అలాగే..
- T Venkateshwarlu
- Published On : February 17, 2024 / 06:55 PM IST
Kishan Reddy
Kishan Reddy: లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో పొత్తులపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమని తెలిపారు. తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు.
రాష్ట్రంలోని 17 సీట్లలో బీజేపీ స్వతంత్రంగా బరిలో నిలుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ను మునిగిపోయే నావగా ఆయన అభివర్ణించారు. బీఆర్ఎస్ కుటుంబ, అవినీతి, తెలంగాణను దోచుకున్న పార్టీ అని అన్నారు. అటువంటి పార్టీతో పొత్తుల ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.
సూర్యుడు పడమర దిక్కున ఉదయించడం అనేది ఎంత అవాస్తవమో, అలాగే, బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందన్నదీ అంతే అవాస్తవమని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్తోనే కాకుండా మరి ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు.
బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల తర్వాత జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు తొలి సమావేశంలో తెలంగాణలోని అత్యధిక స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నామని తెలిపారు. కాగా, లోక్సభ ఎన్నికలపై బీజేపీ అధిష్ఠానం ఢిల్లీలో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉంటోంది. అభ్యర్థుల జాబితా విడుదల గురించి ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: నేను, పవన్ కల్యాణ్ సహా అందరమూ దీనికి బాధితులమే: చంద్రబాబు
