Kukatpally Sahasra Case : కూకట్పల్లి సహస్ర కేసులో బాలుడి స్కెచ్.. ఆ పేపర్ పై రాసిన ‘మిషన్ డన్’ ప్లాన్ ఇదే.. మొత్తానికి బయటపడింది..
కూకట్పల్లి బాలిక హత్య కేసులో (Kukatpally Sahasra Case) విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రైమ్ సిరీస్లు చూసి క్రిమినల్ అవ్వాలని
- Harishth Thanniru
- Published On : August 26, 2025 / 11:34 AM IST
Kukatpally Sahasra Case
Kukatpally Sahasra Case : కూకట్పల్లి బాలిక హత్య కేసులో (Kukatpally Sahasra Case) విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రైమ్ సిరీస్లు చూసి క్రిమినల్ అవ్వాలని బాలుడు అనుకున్నాడు. బాలుడి ఫోన్ చెక్ చేయగా.. అందులో మొత్తం క్రైమ్ సిరీస్ ఎపిసోడ్ లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
రెండు నెలల క్రితమే ఏదో ఒక ఇంట్లో చోరీ చేయాలని బాలుడు ఓ లెటర్ లో రాసుకున్నాడు. అయితే, అతను రాసుకున్న లెటర్కు, సహస్ర హత్యకు సంబంధం లేదని పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులోని నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లను పోలీసులు జోడించనున్నారు. క్రిమినల్ అవ్వాలనే మైనర్ బాలుడు గోల్గా పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. యూటూబ్లో క్రైమ్ సిరీస్ చూసి క్రిమినల్ అవ్వాలని బాలుడు అనుకున్నాడని, అతని ఫోన్ మొత్తం యూట్యూబ్లో సీఐడీ సిరీస్ ఎపిసోడ్లే ఉన్నాయని పోలీసులు చెప్పారు.
బాలుడు చోరీ చేయడానికి ముందే ప్లాన్ను స్లిప్ రాసుకున్నాడు. యూట్యూబ్ లలో క్రైమ్ వెబ్ సిరీస్లు ఎక్కువగా చూసే అలవాటు ఉన్న ఆ బాలుడు రాసుకున్న స్లిప్లో చివరిలో మిషన్ డన్ అని ఉంది.
ఈ కేసు గురించి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. సహస్ర తమ్ముడి వద్ద మంచి క్రికెట్ బ్యాట్ ఉంది. దాన్ని చోరీ చేయాలని నిందితుడు అనుకున్నాడు. అందుకోసమే, దానిని చోరీ చేసేందుకు సహస్ర ఇంట్లోకి వెళ్లాడని తెలిపారు. ఇంట్లో ఉన్న బాలిక అతడిని అడ్డుకోవడంతో ఆమెను కత్తితో దాడి చేసి చంపేశాడని చెప్పారు. ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
ఆ బాలుడు రెండు నెలల క్రితం ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడని కూడా పోలీసులు తెలిపారు. ఆ స్మార్ట్ఫోన్ అతడి వద్దకు ఎలా వచ్చింది? అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఆ బాలుడు స్మార్ట్ఫోన్ కొనుక్కునేందుకు అతడి ఇంట్లో కూడా డబ్బులు ఇవ్వలేదని పోలీసులు చెప్పారు. స్మార్ట్ఫోన్ను కొనుక్కోవడానికి ఇతర నేరాలకు పాల్పడ్డాడా? అన్న దానిపై కూడా విచారణ చేస్తున్నామని సీపీ మహంతి తెలిపారు.
