Telangana elections 2023: బీఆర్ఎస్‌ను ఓడిస్తాం.. కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం: సీపీఐ

ఇప్పటికే కాంగ్రెస్ తో మరికొన్ని పార్టీల నేతలూ చర్చలు జరుపుతున్నారు. మరోవైపు...

Kunamneni Sambashivarao

Telangana elections 2023 – CPI: తెలంగాణలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ పొత్తుల కోసం సీపీఐ ప్రయత్నాలు చేస్తోంది. వామపక్ష పార్టీలతో పొత్తులు లేవని బీఆర్ఎస్ (BRS) తేల్చేయడంతో కాంగ్రెస్ (Congress ) పార్టీతో పొత్తుల కోసం సీపీఐ నేతలు చర్చలు జరుపుతున్నారు.

కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో సీపీఐ చర్చించినట్లు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. దీనిపై హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ‌ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ మధ్యవర్తులతో చర్చలు జరిపామని అన్నారు. తాము జరిపింది ప్రాథమిక చర్చలేనని చెప్పారు.

తాము కొన్ని ప్రతిపాదనలు పెట్టామమని, అంతేగానీ తాము త్యాగం చేస్తామని అనుకోవద్దని తెలిపారు. తమకు బలం ఉన్న సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం చెప్పాక వాటి గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోసారి సీపీఐ-సీపీఎం నాయకత్వం కూడా భేటీ కాబోతుందని అన్నారు.

తమ ప్రతిపాదనలకు కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తే పొత్తులతో ముందుకు వెళ్తామని చెప్పారు. అధికార పార్టీని ఓడించేందుకు తాము ఎవరితోనైనా కలుస్తామని తెలిపారు. ఇప్పుడే సంప్రదింపులు మొదలయ్యాయని అన్నారు. సీపీఐ- సీపీఎం కలిసి ఎన్నికలకు వెళ్లడం మాత్రం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ తో మరికొన్ని పార్టీల నేతలూ చర్చలు జరుపుతున్నారు. మహాకూటమి ఏర్పాటు అవుతుందా? అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం అవుతుందా? అన్న విషయంపై ఇప్పటికీ స్పష్టతరాలేదు.

Alliance Between Congress and Comrades : కాంగ్రెస్‌, కామ్రేడ్స్‌ మధ్య పొడుస్తున్న పొత్తు