వామన్‌రావు దంపతుల హత్య : నాలుగు నెలల క్రితమే పక్కా ప్లాన్

Lawyers murder

Lawyers’ murder : న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీను రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వామన్‌రావు హత్యకు నాలుగు నెలల క్రితమే ప్లాన్‌ చేసినట్లు అతడు వెల్లడించాడు. అడ్వకేట్‌ వామన్‌రావు బతికి ఉంటే తమకు ఎప్పటికైనా సమస్యే అని భావించి కుంట శ్రీనుతో కలిసి హత్యకు పథకం రచించామని పేర్కొన్నాడు.

బిట్టు శ్రీనుకు సంబంధించిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టుపై వామన్‌రావు గతంలో అనేక కేసులు వేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు పెరిగాయి. నాలుగు నెలల క్రితం తమ స్వగ్రామం గుంజపడుగులోనే పాత స్కూల్ బిల్డింగ్ నుంచి రెక్కీ నిర్వహించిన శ్రీను గ్యాంగ్‌.. ఆయనను హత్య చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో జనం ఎక్కువ ఉండటంతో వారి కుట్ర విఫలమైంది. దీంతో ఈనెల 17వ తేదీన పక్కాగా ప్లాన్‌ చేసిన దుండగులు.. వామన్‌రావు ఒంటరిగా దొరకడంతో ఆయనతో పాటు భార్యను కూడా హతమార్చారు.

వామన్‌రావు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత కుంట శ్రీను, బిట్టు శ్రీనుకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అతడిని మహారాష్ట్రకు పారిపొమ్మని బిట్టు శ్రీను సలహా ఇవ్వడంతో… రెండు రోజులు ఇంట్లోనే మకాం వేశాడు. హత్యకు ముందు వేరే సిమ్ కొనుగోలు చేసిన బిట్టు శ్రీను వాటి ద్వారానే తన భాగస్వాములతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ పెద్దపల్లి జంట హత్యల కేసును త్వరిగతిన ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. బిట్టు శ్రీనును అతడి ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు.