Minister KTR Meet VRAs: 20న వీఆర్ఏల డిమాండ్లపై చర్చలు జరుపుదాం.. ఆందోళన విరమించండి ..
వీఆర్ఏల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని, డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం అసెంబ్లీ లోని కమిటీ హాల్ లో వీఆర్ఏల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 20న డిమాండ్లపై చర్చలు జరుపుదామని, ఆందోళన విరమించాలని సూచించారు.
- Harishth Thanniru
- Published On : September 13, 2022 / 04:06 PM IST
Minister KTR
Minister KTR Meet VRAs: వీఆర్ఏలకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వీఆర్ఏల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని, డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేస్తున్న వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ అసెంబ్లీలోని కమిటీ హాల్లో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని, డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని, ఆందోళనను విరమించి విధుల్లోకి రావాలని కేటీఆర్ తనను కలిసిన వీఆర్ఏ ప్రతినిధులకు సూచించారు. ఈ నెల 20న వీఆర్ఏ సంఘం ప్రతినిధులతో సీఎస్ చర్చలు జరుపుతారని కేటీఆర్ హామీ ఇచ్చారు. అయితే వీఆర్ఏ ప్రతినిధులు మాత్రం.. మంత్రి కేటీఆర్ తమ డిమాండ్లపై చర్చలు జరుపుతామనడం సంతోషంగా ఉందని, అయితే.. సమ్మె పూర్తిగా విరమించకుండా వారం రోజులు నిరసన శిబిరాల్లో శాంతియుతంగా కొనసాగిస్తామని తెలిపారు.
అంతకుముందు వీఆర్ఏలు సహా ఏడు సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడితో హైదరాబాద్ నగరం ఉద్రిక్తంగా మారింది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు తమకు పే స్కేల్ పెంచాలని, తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్రతోపులాట చోటుచేసుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్.. వీఆర్ఏలను చర్చలకు పిలిచారు. జేఏసీ నుంచి 15 మంది ప్రతినిధులు మంత్రి కేటీఆర్ తో చర్చలు జరిపారు. ఈనెల 17 జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ముగిసిన అనంతరం 20న వీఆర్ఏ సంఘం ప్రతినిధులతో సీఎస్ చర్చలు జరుపుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ పై నమ్మకం ఉందని, సమస్య పరిష్కరిస్తామని, న్యాయం చేస్తామని వేచి చూడాలని మంత్రి కేటీఆర్ కోరారని తెలిపారు. అయితే అప్పటి వరకు నిరసన శిబిరాల వద్ద శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని వీఆర్ఏల జేఏసీ ప్రతినిధులు తెలిపారు.
