Rythu Bharosa : మధిరలో ‘రైతు భరోసా’ సభ రద్దు.. నిధుల విడుదలపై రేవంత్ సర్కార్ క్లారిటీ..
Rythu Bharosa : మధిర నియోజకవర్గంలో ఈనెల 30న నిర్వహించ తలపెట్టిన రైతు భరోసా సభ రద్దయింది.
- Harish Thanniru
- Updated on- June 29, 2026 / 03:51 PM IST
Madhira Rythu Bharosa Meeting Cancelled Cm Revanth Reddy Release Funds On June 30
Rythu Bharosa : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాగు సమయంలో రైతు భరోసా పథకం పేరుతో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వానాకాలం సాగుకు సంబంధించి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6వేల చొప్పున విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఈనెల 30వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో రైతు ఆశీర్వాద సభను నిర్వహించేందుకు నిర్ణయించగా.. ప్రస్తుతం ఆ సభ రద్దయింది.
భారీ వర్షాల కారణంగా మధిర నియోజకవర్గంలో జరగాల్సిన రైతు భరోసా సభను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రేపు (జూన్30) సాయంత్రం 4గంటలకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రైతు భరోసా సభ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రైతు భరోసా నిధులను విడుదల చేయడంతోపాటు రైతులనుద్దేశించి మాట్లాడనున్నారు.
రైతులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే నిధులు జమ అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాల కారణంగా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే మధిర నియోజకవర్గంలో తలపెట్టిన రైతు భరోసా సభను రద్దు చేయడం జరిగిందని, సభ నిర్వహణకు హైదరాబాద్లో ఇండోర్ వేదికను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
