×
Ad

Maganti Gopinath Family : ఉపఎన్నికల వేళ మాగంటి కుటుంబంలో చిచ్చు.. మొదటి భార్య ఎంట్రీ.. ఎమ్మార్వో ఆఫీసుకు చేరిన పంచాయితీ

Maganti Gopinath Family : జూబ్లీహిల్స్‌హిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సొంత కుటుంబం నుంచి ఊహించని షాక్ తగిలింది.

Maganti Gopinath Family

Maganti Gopinath Family : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సొంత కుటుంబం నుంచి ఊహించని షాక్ తగిలింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వారసత్వం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం చుట్టూ నడుస్తున్న వివాదం ముదిరింది. ఆ పంచాయితీ శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంకు చేరింది.

తహసీల్దార్ కార్యాలయంలో విచారణకు ఫిర్యాదుదారులు మాలని దేవి, ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్‌తోపాటు.. మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి కూడా హాజరయ్యారు. మాగంటి సునీత తరపున ఆమె చిన్న కుమార్తె దీశిరా, వారి తరపు లాయర్ విచారణకు హాజరయ్యారు. ఇరుపక్షాల నుంచి తహసీల్దార్ స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు.

అసలేం జరిగిందంటే..?
గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు రెవెన్యూ అధికారులు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయడంపై మొదటి భార్య మాలినీదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్ సైతం ఇది వరకే జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇదివరకే మాగంటి గోపీనాథ్ తల్లి, ఆయన ఇద్దరు కూతుళ్లు, కుమారుడు తహసీల్దార్ ఎదుట హాజరవ్వగా.. ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ జారీపై గురువారం మాగంటి గోపీనాథ్ రెండో భార్య మాలినీదేవి, ఆమె కుమారుడు తారక్ ప్రద్యుమ్న, మాగంటి తల్లి మరోసారి శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి ఎదుట ఇరుపక్షాల వాదనలు వినిపించారు. అనంతరం ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇష్యూకు సంబంధించిన కేసును ఈనెల 25 వరకు వాయిదా వేశారు.

మాగంటి సునీత తరపున న్యాయవాది లలిత రెడ్డి మాట్లాడుతూ.. గోపీనాథ్ మృతి తరువాత ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ మాగంటి సునీత, వారి పిల్లలు తీసుకున్నారు. దానిపై కొందరు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం నడుస్తుందని అన్నారు. అసెంబ్లీ సెక్రటరీ జారీ చేసిన స్పౌస్ కార్డులో కూడా మాగంటి సునీత పేరు మాత్రమే ఉందని అన్నారు. మాగంటి గోపీనాథ్ అన్ని డాక్యుమెంట్లలో, పాలసీ డాక్యుమెంట్లలో నామిని భార్యగా సునీత, పిల్లలుగా అక్షర, దిశర, వాత్సల్య పేర్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు.

మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలిని దేవి. వారికి నేనే పెండ్లి చేశానని చెప్పారు. వారికి విడాకులు కాలేదని తెలిపారు. సునీతతో మాగంటి గోపీనాథ్‌కు నేను వివాహం చేయలేదని చెప్పారు.

మాగంటి మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న తారక్ మాట్లాడుతూ.. మా నాన్న చనిపోయిన సమయంలో అంత్యక్రియలకు రాకుండా ఓ పార్టీ నాయకులు అడ్డుకున్నారని, మమ్మల్ని బెదిరింపులకు గురిచేశారని ఆరోపణలు చేశారు. మాగంటి గోపీనాథ్ చనిపోకముందు తనతో మాట్లాడేవారని.. వాయిస్ మెస్సేజ్ లు, వాయిస్ మెయిల్స్, ఆడియోలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇది కేవలం ఫ్యామిలీ విషయం.. ఇందులో రాజకీయాలకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రద్యుమ్న చెప్పుకొచ్చారు.