Mahabubnagar MLC Polls : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు కలిసి 1,439 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎంపికైన కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేసి, గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కల్వకుర్తి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారాయణ రెడ్డి విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం ఉపఎన్నిక పోలింగ్ ఇవాళ జరుగుతుంది. పోటీలో బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ ఉన్నారు.
Also Read : ED: నగదు అక్రమ చలామణి.. సీఎం కూతురిపై కేసు పెట్టిన ఈడీ
ఆయా పార్టీల అధిష్టానాలను ఓటర్లను క్యాంపులకు తరలించిన విషయం తెలిసిందే. వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొడంగల్ నియోజకవర్గం వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా ఎన్నిక కావటంతో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇవాళ కొడంగల్ వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే పోలింగ్ సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించారు.
Also Read : భువనగిరి నుంచి పోటీ చేయాలని నన్ను రాజగోపాల్ రెడ్డి కోరారు: మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు