Hyderabad MLC Election: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం అభ్యర్థి విజయం.. ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే..?
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు.
- Harish Thanniru
- Updated on- April 25, 2025 / 09:24 AM IST
Hyderabad local body MLC elections
Hyderabad MLC Election: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ కు 63 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు పోలయ్యాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్స్ లను తెరిచిన ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే ఫలితం వెల్లడైంది.
Also Read: Indus Waters Treaty: ఇండియా దెబ్బ అదుర్స్.. పాకిస్థాన్లో కరెంట్ సంక్షోభం..?
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నిక 22ఏళ్ల తరువాత జరిగింది. ఈ ఎన్నికకు సంబంధించి బుధవారం పోలింగ్ (ఈనెల 23న) ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి గౌతంరావు, ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ మాత్రమే పోటీలో నిలిచారు. మొత్తం 112 మంది ఓటర్లు ఉండగా.. అందులో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఆ పార్టీ ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ క్రమంలో బుధవారం జరిగిన పోలింగ్ లో 78.57శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఇవాళ్టి ఫలితాల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ కు 63 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు పోలయ్యాయి.
