Minister Komatireddy Venkat Reddy : ప్రజలకు క్షమాపణలు చెప్పాకే కేసీఆర్ నల్గొండలో అడుగు పెట్టాలి
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
- Harishth Thanniru
- Published On : February 11, 2024 / 12:11 PM IST
Komatireddy Venkat Reddy
Minister Venkat Reddy : అసెంబ్లీలో వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని, కాంగ్రెస్ ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ.. విద్యారంగానికి ప్రాధాన్యం ఇచ్చామని, ప్రతి గ్రామానికి రోడ్లు వేసేలా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధికి సూపర్ గేమ్ చెంజర్ కానుందని అన్నారు. బడ్జెట్ పై విమర్శలు చేసేవారు మూర్ఖులు అన్నారు.
రాష్ట్ర విభజన తరువాత నీటి కేటాయింపులకు అంగీకరించింది ఎవరు? నల్గొండను నట్టేట ముంచిన ఘనత గత ప్రభుత్వానిదేనని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కేసీఆర్ మోసాన్ని గుర్తించారు కాబట్టే భారీ మెజార్టీతో ఓడగొట్టారని అన్నారు. ప్రజల తీర్పు చూశాకకూడా కేసీఆర్ ఏముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ కోసం నల్గొండ చౌరస్తాలో కుర్చీవేసి ఉంచుతామన్నారు. కృష్ణా రివర్ బోర్డ్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు, బీఆర్ ఎస్ నేతలకు లేదని కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Also Read : CM Revanth Reddy : ఆర్టీసీ బస్సులో సీఎం రేవంత్రెడ్డి ప్రయాణం.. కొత్తగా 100 బస్సులు..
పదేళ్లు అధికారంలో ఉండి నల్గొండ జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేదని, పాలమూరును ఎండబెట్టారంటూ గత ప్రభుత్వం పెద్దలపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ సపోర్టు చేశారని అన్నారు. జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తరువాతే కేసీఆర్ నల్గొండలో అడుగు పెట్టాలని హెచ్చరించారు. కవితకు పదేళ్లు గుర్తుకురాని జ్యోతీరావు పూలే ఇవ్వాళ గుర్తుకు వచ్చారా? అంటూ మంత్రి ప్రశ్నించారు.
