KTR Khammam Tour: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన.. షెడ్యూల్ ఇలా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ శనివారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్న మంత్రి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
- Harishth Thanniru
- Published On : September 30, 2023 / 09:28 AM IST
Minister KTR
Minister KTR: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ శనివారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్న మంత్రి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో నిర్వహించ తలపెట్టిన సభల్లో పాల్గోనున్నారు. మంత్రి కేటీఆర్తో పాటు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక బీఆర్ఎస్ నేతలు పాల్గొంటారు.
Read Also : Minister KTR : మోదీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
మంత్రి పర్యటన షెడ్యూల్ ఇలా..
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఖమ్మం జిల్లాలోని వైరాకు మంత్రి కేటీఆర్ చేరుకుంటారు. ఉదయం 8:40 గంటలకు కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద గోద్రేజ్ కంపెనీ నిర్మించబోతున్న ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీకి మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి హెలీకాప్టర్లో ఖమ్మంలోని మమతా మెడికల్ కళాశాల ఆవరణకు చేరుకుంటారు. కళాశాల సమీపంలోని లకారం ట్యాంక్బండ్పై ఎన్టీఆర్ మునిసిపల్ పార్కును ప్రారంభిస్తారు. రెండో విడత అమృత పథకం కింద మంజూరైన రూ.250కోట్లతో చేపట్టనున్న అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ఖమ్మం నగరంలో రామచంద్రయ్య నగర్ మునిసిపల్ స్పోర్ట్స్ పార్కు, జయశంకర్ మునిసిపల్ పార్కులతోపాటు గోళ్లపాడు అండర్గ్రౌండ్ డ్రెయినేజీపై నిర్మించిన పార్కును ప్రారంభిస్తారు.
మున్నేరు వరద నివారణకు కాల్వఒడ్డు వద్ద రూ.690కోట్లతో నిర్మించనున్న కాంక్రీట్వాల్స్కు, అదేవిధంగా రూ.180కోట్లతో నిర్మించబోయే తీగల వంతెన పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఖమ్మం వీడియోస్ కాలనీకి చేరుకుని మునిసిపల్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ భవనాలను మంత్రులు ప్రారంభిస్తారు. అనంతరం రూ.100 కోట్ల ఖమ్మం నగర అభివృద్ధి నిధులు, రూ.20కోట్లు ఎల్ఆర్ఎస్ నిధులతో చేపట్టే పనులకుకూడా మంత్రులు శ్రీకారం చుడతారు. అనంతరం ఖమ్మం ప్రగతినివేదిక సభలో పాల్గొంటారు. ఖమ్మం అభివృద్ధి గురించి చిత్రీకరించి వీడియోను ప్రదర్శిస్తారు. ఆ తర్వాత మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్, ప్రశాంతరెడ్డి ప్రసంగిస్తారు. ఈ సభ అనంతరం 12:30 గంటలకు హెలికాప్టర్లో భద్రాచలం చేరుకుంటారు.
భద్రాచలం నుంచి మంత్రి కేటీఆర్ కూనవరం రోడ్డులో గోదావరి వరద నివారణకోసం రూ.38కోట్లతో కరకట్ట పొడిగింపు పనులు, భద్రాచలం పట్టణ అభివృద్ధికి రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2:35 గంటలకు హెలికాప్టర్లో సత్తుపల్లి చేరుకుని సుమారు రూ.100 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించి సత్తుపల్లిలో జరిగే బహిరంగసభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ తిరుగుపయనమవుతారు.
