Kaushik Reddy Sensational Comments టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ జెండా మోసిన వారికే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కౌశిక్ రెడ్డి చెప్పారు. వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాం తప్పా.. వేరే వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నాయకులు ఇచ్చిన జాబితా ప్రకారమే కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ ఇళ్లు కట్టుకోవడానికి రూ.3 లక్షలు ఇవ్వనున్నారని.. ఆ డబ్బులు కేవలం టిఆర్ఎస్ కార్యకర్తలకి అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గ్రామాల్లో సర్పంచ్, ఎంపిటిసి, ఇతర టిఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇచ్చిన లిస్టులో పేర్లు ఉన్నవారికి మాత్రమే డబుల్ బెడ్ ఇళ్లను ఫైనల్ చేస్తామని అన్నారు. సోమవారం పెద్దపల్లిలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, జన సమీకరణ కోసం ఈ టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.