హుస్సేన్ సాగర్ వద్ద నైట్ బజార్, అర్ధరాత్రి వరకు షాపింగ్
- madhu
- Published On : November 4, 2020 / 07:53 PM IST
Night Bazaar along Hussain Sagar : హుస్సేన్ సాగర్ అందాల సరసన నైట్ బజార్ ను ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ యోచిస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు సంజీవయ్య పార్కు నుంచి బుద్ధ భవన్ వరకు హుస్సేన్సాగర్ తీరం వెంబడి ‘నైట్ బజార్’ అభివృద్ధి చేయనున్నారు. పర్యాటకానికి మరింత ఆకర్షణ వస్తుందని భావిస్తున్నారు.
సుమారు 1300 మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. రూ. 15 కోట్ల అంచనాతో ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానించనున్నారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. చార్మినార్ చుడీబాజర్ తరహాలో అత్యాధునిక హంగులతో సాగర్ తీరం వెంబడి నైట్ బజార్ ఏర్పాటు కానుంది.
మొత్తం 150 నుంచి 200 దుకాణాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వీటిల్లో గార్మెంట్స్, గాజులు, వెడ్డింగ్ మెటీరియల్, జువెల్లరీ, ఇయర్ రింగ్స్ తో పాటు పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులను విక్రయించనున్నారు. ఫుడ్ కోర్టులు, ఆధునిక లైటింగ్ సిస్టం, సిట్టింగ్, వుడ్ ప్లాస్టిక్ కంపోజిట్ డెక్ ఏర్పాటు చేయనున్నారు. ఆసక్తి కనబరిచిన ఏజెన్సీకి తొలుత పది సంవత్సరాల పాటు బాధ్యతలను ఇవ్వనున్నారు.
