Parkal Politics : కొండా సుస్మిత సంచలన పోస్ట్.. సీఎం రేవంత్కు సవాల్?
Parkal Politics : అధికార కాంగ్రెస్ పార్టీలో పరకాల నియోజకవర్గం పొలిటికల్ వార్ కాకరేపుతోంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
- Harish Thanniru
- Updated on- August 19, 2026 / 11:32 AM IST
Parkal Politics
Parkal Politics : తెలంగాణలో పరకాల నియోజకవర్గం రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో పరకాల పొలిటికల్ వార్ కాకరేపుతోంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డికే నేరుగా సవాల్ చేస్తున్నట్లుగా ఆ పోస్టు ఉండటంతో రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది.
Also Read : Vijayasai Reddy : కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తున్నా.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన.. పార్టీ పేరు ఏమిటంటే?
పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాశ్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే, మంత్రి కొండా సురేఖ గతంలో పరకాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. మంత్రి సొంతూరు వంచనగిరి కూడా ఇదే నియోజకవర్గంలో ఉండటంతో వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తన కుమార్తె సుస్మిత పటేల్ను బరిలోకి దింపాలని కొండా దంపతులు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, ఇటీవల పరకాల నియోజకవర్గంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో ఒకరకంగా ప్రకాశ్ రెడ్డికి మళ్లీ టికెట్ ఖరారైనట్టేననే ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొండా సుస్మిత పటేల్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా సంచలన పోస్టు పెట్టారు.
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్టు కొత్త చర్చకు దారితీసింది. తన ఇస్టాగ్రామ్లో “అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే” అంటూ ఆమె పోస్టు చేయడంతో పరకాల అధికార పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. అయితే, బహిరంగ సభ వేదికగా రేవూరి ప్రకాశ్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించిన కొద్ది గంటలకే సుస్మితా పటేల్ “అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే” అంటూ పోస్టు చేయడం ద్వారా రేవంత్ రెడ్డికి నేరుగా సవాల్ విసిరినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా పరకాల నియోజకవర్గం పరిధిలో భారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా గీసుకొండ మండలంలోనూ పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సుస్మిత పటేల్ రాజకీయంగా కీలక ప్రకటన చేస్తారా? అని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఒకవైపు రేవూరి ప్రకాశ్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు.. మరోవైపు పరకాల నుంచి పోటీకి సుస్మిత పటేల్ సిద్ధమవుతున్నారన్న చర్చ నేపథ్యంలో పరకాల కాంగ్రెస్లో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. పరకాల నియోజకవర్గంలో రేవూరి వర్సెస్ కొండా ఫ్యామిలీగా మారుతున్న పవర్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. ఈ అంశానికి ఏ విధంగా చెక్ పెడితుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఎమ్మెల్యే రేవూరి కామెంట్స్..
ఇదిలాఉంటే.. కొండా సుస్మిత పటేల్ ఇన్స్టా పోస్టుపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించారు. సుస్మిత పటేల్ సోషల్ మీడియా ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. పీసీసీ చీఫ్ వేదికపై ఉండగానే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. నియోజకవర్గంలో కన్ఫ్యూషన్ పాలిటిక్స్కు తెరవేసేందుకు సీఎం నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించి క్లారిటీ ఇచ్చారు. సర్వేలు అభివృద్ధి ప్రామాణికంగా ముఖ్యమంత్రి నా పేరు ప్రకటించారు. కాంగ్రెస్ శ్రేణులకు నియోజకవర్గ నాయకులకు క్లారిటీ ఇవ్వడం కోసమే ముఖ్యమంత్రి ప్రకటన చేశారని రేవూరి అన్నారు. ఎవరు గీత దాటిన అధిష్టానం చూసుకుంటుంది. ఇలాంటి సోషల్ మీడియా ప్రచారాలను అధిష్టానం గమనిస్తుంది. మంత్రి కొండా సురేఖ బర్త్ డే వేడుకల్లోని విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
