Dalit Bandhu scheme : దళిత బంధు పథకంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. జనవాహిని, జైస్వరాజ్, తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు శుక్రవారం పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పథకాన్ని హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టడం సరికాదని పిల్ దాఖలు చేశారు. పైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నాయి.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఉప ఎన్నికల్లో లబ్ధి కోసమే హుజూరాబాద్ లో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో హైకోర్టులో పిల్ దాఖలైంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలతో పాటు ఈసీ, తెలంగాణ ప్రభుత్వాన్ని పిటిషనర్లు ప్రతివాదులుగా చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం తీసుకురావాలని సంకల్పించింది. రైతు బంధు పథకం తరహాలోనే దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.