Private Travels buses operating illegally are under siege : నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రవాణా అధికారుల బృందాలు పలు ప్రాంతాల్లో నిఘా వేసి వాహనాలను తనిఖీ చేశారు. వందలాది బస్సులను చెక్ చేసిన అధికారులు రూల్స్కు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో ప్రయాణికులతో పాటు లగేజిని కూడా రవాణా చేస్తున్న బస్సులపై చర్యలు తీసుకుంటామంటున్నారు ఆర్టీఏ అధికారులు. హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎల్బీ నగర్, పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద, బెంగళూరు హైవే మార్గంలోని శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని తొండుపల్లి 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు ఆర్టీఏ అధికారులు.
ఎల్బీ నగర్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మూడు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. మరో ఆరు బస్సులపై కేసు నమోదు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పండుగ వేళ అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.