తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు
- bheemraj
- Published On : July 31, 2020 / 11:55 PM IST
తెలంగాణలో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరఠ్వాడా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
శని, ఆదివారాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఆగస్టు 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.
