ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరకే అమ్మకానికి రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు

www.swagruha.telangana.gov.inలో పూర్తి వివరాలు చూసుకోవచ్చు.

Rajiv Swagruha

తక్కువ ధరకు ఫ్లాట్ లభ్యమైతే కొనాలని ఎదురుచూస్తున్న పేద, మధ్య తరగతి వారికి గుడ్‌న్యూస్‌. పోచారంలోని సద్భావన టౌన్​షిప్​లో మిగిలిన ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. వీటిలో 255 సింగిల్​ బెడ్​రూమ్ ఫ్లాట్లు (ఒక్కోటి రూ.13 లక్షలకు), 340 డబుల్ బెడ్​రూమ్ ఫ్లాట్లు (ఒక్కోటి రూ.25 లక్షలు) అందుబాటులో ఉన్నాయి.

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తాజాగా పోచారం టౌన్​షిప్​ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్లు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ విశాలమైన రోడ్లతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు.

Also Read: హైదరాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

ఈ టౌన్​షిప్​లో వెయ్యికి పైగా కుటుంబాలు ఉంటున్నాయి. ఇప్పుడు విక్రయానికి ఉంచిన ఫ్లాట్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తైతే ఈ టౌన్​షిప్​కు కేవలం 10 నిమిషాల్లో ప్రయాణించవచ్చని తెలిపారు.

పోచారంలో ఇన్ఫోసిస్‌తో పాటు రహేజా ఐటీ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోనే ఈ ఫ్లాట్లు ఉన్నాయని చెప్పారు. బహిరంగ మార్కెట్​లో ఇటువంటి ఫ్లాట్ల రేట్లు రూ.50 లక్షలకు తక్కువగా లేవని తెలిపారు.

ఫ్లాట్లు కొనడానికి ఆసక్తి చూపుతున్న వారి నుంచి అప్లికేషన్ టోకెన్ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఫ్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. మరోవైపు, నాగోల్‌ సమీపంలోని బండ్లగూడ సహభావన టౌన్​షిప్​ కూడా ఫ్లాట్లను విక్రయానికి ఉంచారు. www.swagruha.telangana.gov.inలో పూర్తి వివరాలు చూసుకోవచ్చు.