Telangana Rain Alert : తెలంగాణకు రెడ్ అలర్ట్.. రెండు రోజులపాటు ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
- Harishth Thanniru
- Published On : July 25, 2023 / 09:48 AM IST
hyderabad rain
Rain Alert : తెలంగాణ రాష్ట్రాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. గతకొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇది చాలదన్నట్లు వాతావరణ శాఖ తాజాగా వర్ష సూచన చేసింది. తెలంగాణలో మంగళవారంతో పాటు బుధ, గురువారాల్లోనూ వర్షాలు దంచికొడతాయని తెలిపింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది మరింత తీవ్రమై బుధవారానికి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలవైపు కదిలే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా.. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్తో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు తప్పని సరి అయితేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.
Names of Rains : వానల్లో ఎన్ని రకాలున్నాయో తెలుసా..? వాటి పేర్లు, అర్థాల్లో ఆసక్తికర విషయాలు..
మరోవైపు ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది వాతావరణ శాఖ. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
భాగ్యనగరంలో ఖైరతాబాద్, చార్మినార్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లో మినహా ప్రజలు బయటకు రావొద్దంటూ జీహెచ్ఎంసీ ట్వీట్ చేసింది. ఇదిలాఉంటే సోమవారం రాత్రి గ్రేటర్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వరుణుడు విరుచుకుపడటంతో నగరంలోని రహదారులన్నీ జలమయం అయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో తమతమ కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
