Revanth Reddy (Photo : Twitter)
Revanth Reddy – CM KCR : బీఆర్ఎస్ సర్కార్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఒకవేళ డిపాజిట్లు వస్తే మేము గుండు కొట్టించుకుంటామన్నారు రేవంత్ రెడ్డి.
” రాష్ట్రంలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ది. అందుకే నేను కేసీఆర్ కు సవాల్ విసిరా. ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇళ్లు కట్టామో అక్కడే మేం ఓట్లు అడుగుతాం. ఎక్కడ మీరు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టారో అక్కడే మీరు ఓట్లు అడగండి. సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డికి సవాల్ విసురుతున్నా. మీ ఒంట్లో చీము, నెత్తురు ఉంటే… మీసమున్న మగాళ్లు అయితే నా సవాల్ ను స్వీకరించాలి. ఈ సవాల్ ను స్వీకరిస్తే ఏ నియోజకవర్గంలోనూ మీకు డిపాజిట్లు రావు. అయినా మీకు డిపాజిట్లు వస్తే మేం గుండు కొట్టించుకుంటాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.
మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ”గతంలో కుమ్మరి ఎల్లవ్వ ఇంటికి వచ్చి చూస్తే.. మురికి నీరు అంతా ఆ ఇంట్లోకే వెళ్ళేది. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఎల్లవ్వ ఇల్లు చూశా. కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళడానికి మంచి దారి వేసుకున్నారు. కానీ, ఎల్లవ్వ ఇల్లు కంటే 6 ఫీట్లు ఎత్తు రోడ్డు వేసి ఎల్లవ్వ ఇల్లును ముంచారు. రోడ్డు బాధితులకు న్యాయం చేయాలని ఎంపీగా కలెక్టర్ కు చెప్పినా పట్టించుకోలేదు.
ఇక్కడి బీఆర్ఎస్ నాయకులకు భూకబ్జాలు తప్ప పేదల బాధలు పట్టవు. అందుకే మా నాయకులకు చెప్పి ఎల్లవ్వకు ఇందిరమ్మ ఇల్లు కట్టించాము. అధికారంలోకి రాగానే రాష్ట్రం మొత్తం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు అందిస్తాం. రూ.5లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తాం. రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటాం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేస్తాం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటాం” అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.