మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు దగ్దం
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులతో ఆదివారం రాత్రి 12గంటల సమయంలో బయలుదేరింది.
- Harishth Thanniru
- Published On : July 15, 2024 / 06:43 AM IST
Road accident
Road Accident in Mahbubnagar District : మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్ల పట్టణం సమీపంలో జాతీయ రహదారి -44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 2గంటల సమయంలో డీసీఎం వాహనం, బస్సు ఢీకున్నాయి. ఈ ప్రమాదంతో ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్దమైంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Also Read : హైదరాబాద్లో వర్ష బీభత్సం.. వరదలో చిక్కుకున్న కారు, ప్రాణాలకు తెగించి కారులో ఉన్నవారిని కాపాడిన స్థానికులు
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులతో ఆదివారం రాత్రి 12గంటల సమయంలో బయలుదేరింది. జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి మలుపు వద్దకు రాగానే.. డీసీఎం వాహనం యూటర్న్ తీసుకునేందుకు మూలమలుపు తిరిగింది. అదేసమయంలో ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీకొన్నాయి. బస్సు అదుపుతప్పి కుడివైపు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఆ వెంటనే బస్సులో మంటలు మొదలయ్యాయి. బస్సు దగ్దమవుతుండటంతో స్థానికులు, ఘటన స్థలంకు చేరుకున్న పోలీస్ సిబ్బంది బస్సులోని క్షతగాత్రులను బయటకుతీసి ఆస్పత్రికి తరలించారు.
Also Read : రత్న భండార్ మూడో గదిలో ఏముంది? ఎందుకు వెళ్లలేకపోయారు? అసలేం జరిగింది..
అగ్నిమాపక సిబ్బంది బస్సు దగ్దమవుతుండటంతో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే బస్సు పూర్తిగా దగ్దమైంది. ప్రయాణీకులు బస్సు నుంచి సకాలంలో బయటకు రాకపోయినా, బస్సుకు మంటలు వేగంగా వ్యాప్తిచెందినా అనేక మంది అగ్నికి ఆహుతయ్యేవారని, భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న వారు ఎక్కువగా అనంతపురం ఉమ్మడి జిల్లా, హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు.
