Yadagirigutta Parking Charges : గంటకు రూ.500.. యాదగిరిగుట్టపై పార్కింగ్ చార్జీల బాదుడు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కొండపైకి వాహనాలను అనుమతించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. పార్కింగ్ చార్జీల మోత మోగించింది. కొండపైకి అనుమతించిన వాహనాలకు పార్కింగ్ చార్జీలు వసూలు చేయనున్నారు.
- Naveen
- Published On : April 30, 2022 / 08:11 PM IST
Yadagirigutta Parking Charges
Yadagirigutta Parking Charges : తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించాలని నిర్ణయించిన యాదగురిగుట్ట ఆలయ అధికారులు.. భక్తులకు భారీ షాక్ ఇచ్చారు. కొండపైకి వచ్చే వాహనాలకు ప్రవేశ రుసుము వసూలు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. ఈ క్రమంలో పార్కింగ్ చార్జీల మోత మోగించారు. కొండపైకి వచ్చే వాహనాలకు ఆదివారం నుంచి పార్కింగ్ చార్జీలు వసూలు చేయనున్నారు. కొండపై పార్కింగ్ చేసిన వాహనానికి గంటకు రూ.500 వసూలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతి గంటకు అదనంగా రూ.100 వసూలు చేయనున్నారు. ఆదివారం నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కాగా ప్రొటోకాల్, దాతల వాహనాలకు మాత్రం ఈ ప్రవేశ రుసుం నుంచి మినహాయింపు కల్పించారు.
Yadadri : యాదగిరిగుట్టలో ఫుల్ రష్.. ఆటో వాలాల ఆందోళన
అయితే, పార్కింగ్ చార్జీలపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలుగా ధరలు నిర్ణయించారని మండిపడుతున్నారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత కొండపైకి వాహనాలను దేవస్థానం అనుమతించని సంగతి తెలిసిందే. అయితే, భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించాలని గత కొంత కాలంగా ఆందోళన నడిచింది. దీంతో కొండపైకి భక్తుల వాహనాలను అనుతించారు ఆలయ అధికారులు. అదే సమయంలో పార్కింగ్ ఫీజు పేరుతో భక్తులపై ఛార్జీల మోత మోగించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల తర్వాత స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. మార్చి 28న యాదాద్రి ప్రధాన ఆలయాన్ని తెరిచారు. కృష్ణ శిలలతో ఆలయ నిర్మాణం జరిగింది. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
