మేడారం మహాజాతర పరిసమాప్తం.. వన దేవతలు గద్దెలను విడిచే సమయంలో వర్షం
Medaram: మేడారంలో వర్షం పడింది. దీంతో ఈ పరిణామాన్ని శుభ సూచకంగా భావిస్తూ భక్తులు జయజయ ధ్వనాలు చేశారు.
- T Venkateshwarlu
- Published On : February 24, 2024 / 08:09 PM IST
Sammakka Saralamma Jatara Ends
మేడారం మహాజాతరలో భక్తజనులకు నాలుగు రోజుల పాటు దర్శనమిచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఇవాళ జనాన్ని విడిచి వనంలోకి వెళ్లారు. మేడారం గద్దెపై నుంచి చిలకలగుట్టకు సమ్మక్క విగ్రహాన్ని తీసుకెళ్లారు. అలాగే, కన్నెపల్లికి సారలమ్మ, పూనుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు వెళ్లారు.
వన దేవతలు గద్దెలను విడిచే సమయంలో మేడారంలో వర్షం పడింది. దీంతో ఈ పరిణామాన్ని శుభ సూచకంగా భావిస్తూ భక్తులు జయజయ ధ్వనాలు చేశారు. వనదేవతలు గద్దెలు వీడటంతో మేడారం మహాజాతర పరిసమాప్తమైంది.
కాగా, అంతకుముందు పూజారుల కుటుంబ సభ్యులు, వారి బంధువులతో కలిసి గద్దెల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ప్రధాన వడ్డెలు దేవతల రూపాలను తీసుకుని వారి నిజస్థానాలకు తీసుకువెళ్లారు. భక్తులు ఇవాళ కూడా తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.
జంపన్న వాగులో పవిత్ర స్నానాలు చేసి గద్దెల వద్దకు చేరి అమ్మవార్లను దర్శించుకున్నారు. బంగారానికి కుంకుమ బొట్లు పెట్టి, ముఖానికి పసుపు రాసుకొని పిల్లాజెల్లతో అమ్మలను దర్శించుకొని తన్మయత్వం పొందారు.
