Gadwal Politics: చుక్కలు చూపిస్తున్న గద్వాల నయా జేజమ్మ

ఏ పదవీ లేకపోయినా తన మాటే శాసనం అన్న శివగామి డైలాగ్‌ను పదేపదే వల్లెవేస్తుండటంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు..

గద్వాల గడీలో పవర్ ఫైట్ పీక్స్‌కు చేరుకుంటోంది… ఎమ్మెల్యేగా ఓడినా తానే పవర్ సెంటర్ కావాలని కోరుకుంటున్నారట ఈ నయా గద్వాల జేజమ్మ. పార్టీలోకి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేకు.. ఆయనకు మద్దతుగా నిలిచిన మంత్రికి చుక్కలు చూపిస్తున్నారట… దీంతో గద్వాల రాజకీయం గడప దాడి రోడ్డెక్కుతోంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో గద్వాల మార్కు రాజకీయమే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

గద్వాల జేజమ్మ అనగానే బీజేపీ ఫైర్‌ బ్రాండ్, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ గుర్తుకొస్తారు. అయితే ఇప్పుడు ఎంపీ డీకే అరుణను తలపించేలా తయారయ్యారట కాంగ్రెస్ నేత, మాజీ జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య. శివాలెత్తిపోతూ నయా జేజమ్మగా మారి కాంగ్రెస్ సీనియర్ నేతలకే చుక్కలు చూపిస్తున్నారామె. బీఆర్ఎస్‌ హయాంలో జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన సరిత.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

అయితే జడ్పీ చైర్‌ పర్సన్ పదవి ఉండటంతో గత నెలవరకు అధికారికంగా అన్నిరకాల ప్రొటోకాల్ సౌకర్యాలు అనుభవించారు సరిత. ఇప్పుడు జడ్పీ పదవీకాలం కూడా పూర్తికావడంతో ఆమె మాజీ అయిపోయారు. మాజీ అయినా తనకు తెలియకుండా నియోజకవర్గంలో ఏ పనీ చేయడానికి వీల్లేదని ఆమె హుకుం జారీ చేయడమే కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆమె తీరును ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్, ఆయన రాజకీయ గురువు, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు.

కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దని గొడవ
కొద్ది రోజుల క్రితం మహిళా నేత సరిత తిరుపతయ్యకు సమాచారం లేకుండా మంత్రి జూపల్లి నియోజకవర్గానికి వచ్చారని నానా రచ్చ చేశారు సరిత వర్గీయులు. అంతకుముందు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దని హైదరాబాద్లో గొడవకు దిగారు. ఐతే, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కృష్ణమోహన్‌కు ఉన్న గుర్తింపు, గౌరవం కూడా తనకే దక్కాలన్నట్లు సరిత వ్యవహరిస్తుండటమే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమవుతోంది.

అధికారిక ప్రొటోకాల్ లేకపోయినా, తనకు తెలియకుండా ఏ పనీ చేయడానికి వీల్లేదన్న మొండిపట్టుదల ప్రదర్శిస్తుండటం, ఎమ్మెల్యేను డమ్మీ చేసేలా ఆమె పావులు కదుపుతుండటంతో ఎమ్మెల్యే వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యలో ఓసారి మళ్లీ కారెక్కేందుకు కూడా రెడీ అయిపోయారు సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి.

మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నేతలకన్నా ఎక్కువగా ఎమ్మెల్యేను సరిత టార్గెట్ చేస్తుండటం ఇప్పుడు గద్వాలలో రాజకీయాన్ని రంజుగా మారుస్తోంది. సరితకు సర్దిచెప్పాల్సిన కాంగ్రెస్ నాయకులు…. సైలెంట్‌గా ఉంటుండటంతో ఎమ్మెల్యే వర్గీయులు రగిలిపోతున్నారు. దీనిపై సరితకు నచ్చజెప్పడానికి జిల్లాలో ఏ ఒక్కరూ సాహసించలేకపోతుండటమే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

నిజానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్, మహిళా నేత సరిత… ఇద్దరూ బీఆర్ఎస్‌లోనే ఉండేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ వారిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగడంతో ఎన్నికల ముందు సరిత కాంగ్రెస్లో చేరారు. ఐతే ఎన్నికల్లో సరిత ఓటమి చెందినా, పార్టీ అధికారంలో రావడం, అప్పటికి అమె జడ్పీ చైర్ పర్సన్‌గా ఉండటంతో ఆమె మాటే చెల్లుబాటయ్యేలా ప్రభుత్వం చూసింది.

ఐతే రెండు నెలల క్రితం జడ్పీ పదవీకాలం ముగియడం, అదేసమయంలో ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి రావడంతో ప్రొటోకాల్ పరంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఐతే ఈ పరిస్థితిని అసలు ఏ మాత్రం జీర్ణించుకోలేని సరిత… ఫైర్‌బ్రాండ్ అవతారమెత్తారు. తానే పవర్ సెంటర్ కావాలని కోరుకుంటున్నారు. ఇందుకుతగ్గట్టే.. నియోజకవర్గానికి ఎవరు వచ్చినా, ఏ పనిచేయాలన్నా తన దృష్టికి రావాల్సిందేనంటున్నారు. చివరికి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనకు వచ్చినా ముందుగా తనకే సమాచారం ఇవ్వాలంటూ అధికారులకు హుకుం జారీ చేశారట సరిత.

ఇప్పుడు అంతకు మించి..
దీనికి భిన్నంగా ఓ సారి ఎమ్మెల్యేతో కలిసి మంత్రి జూపల్లి పర్యటనకు బయలుదేరగా… వారిని అడ్డగించి దాడి చేసినంత పనిచేశారు సరిత వర్గీయులు. ఇలా సరిత వ్యవహారశైలి ఇటు నియోజకవర్గంలో.. అటు పార్టీలో రచ్చగా మారుతోంది. వాస్తవానికి గద్వాల రాజకీయమంటేనే కత్తిమీద సాములాంటిది. రాజకీయాల్లో ఉద్దండలైన నేతలు ఈ నియోజకవర్గంలో ఎందరో ఉన్నారు. వారందరినీ మించినట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్ గత పదేళ్లు చక్రం తిప్పితే… ఇప్పుడు అంతకు మించి అన్నట్లు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాకుండానే సరిత పట్టుబిగిస్తున్నారంటున్నారు.

ఏ పదవీ లేకపోయినా తన మాటే శాసనం అన్న శివగామి డైలాగ్‌ను పదేపదే వల్లెవేస్తుండటంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా మంత్రి జూపల్లికి ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారిందంటున్నారు. సీఎం ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేను పార్టీలోకి తెచ్చిన జూపల్లి… ఇప్పుడు సరితకు సర్దిచెప్పలేక.. ఎమ్మెల్యేను వెనకేసుకురాలేక అడకత్తరలో పోకచెక్కలా నలిగిపోతున్నారంటున్నారు. ఏదిమైనా గద్వాల నయా జేజమ్మగా సరిత మొండిగా దూసుకుపోతుండటం… ఆ రోజుల్లో డీకే అరుణను గుర్తు చేస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ జేజమ్మను దారికి తెచ్చే దారేదో తెలియక సతమతమవుతున్నారట తల పండిన కాంగ్రెస్ నేతలు.

Also Read: వైసీపీకి బిగ్‌ షాక్‌ తగలనుందా?

ట్రెండింగ్ వార్తలు