Malkajgiri court
Malkajgiri court : ఓ హత్య కేసులో మల్కాజ్గిరి అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పూజారి అనుమాల మురళీకృష్ణ అలియాస్ కిట్టుకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్షతో పాటు, రూ.7వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మల్కాజ్గిరి 4వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డి. కిరణ్ కుమార్ ఈమేరకు తీర్పు ఇచ్చారు. 2022 ఏప్రిల్ 18న దేవాలయంలో జరిగిన హత్యకు సంబంధించిన కేసులో ఈ తీర్పును ఇచ్చారు.
Also Read : Hyderabad : ఏసు ప్రభువు వచ్చి బతికిస్తాడని.. నాలుగు రోజలుగా ఇంట్లోనే మృతదేహం.. దుర్వాసన రావడంతో..
మల్కాజ్ గిరి విష్ణుపురి స్వయంభూ సిద్ధివినాయక గుడిలో 2022 ఏప్రిల్ 18వ తేదీన హత్య జరిగింది. అదే ఆలయంలో మురళీకృష్ణ పూజారిగా పనిచేస్తున్నాడు. గుడికి వచ్చిన ఉమాదేవి అనే మహిళను బంగారు నగల కోసం దారుణంగా హత్య చేశారు. గర్భగుడిలో ఐరన్ రాడ్డుతో తలపై మోదీ చంపాడు. మృతురాలి ఒంటిపై ఉన్న నగలు కాజేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని డ్రమ్ములో దాచిపెట్టి మూడు రోజులు గుడికి తాళాలు వేశారు. మూడు రోజుల తరువాత గుడి వెనుక చెట్ల పొదల్లో మృతదేహాన్ని పాతిపెట్టాడు.
మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసుల దర్యాప్తు సమయంలో గుడి బయట మృతురాలి చెప్పులు లభించాయి. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. చెప్పులను ఆధారం చేసుకొని పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పూజారిపై అనుమానం రావడంతో పూజారి మురళీకృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు.