Severe Suns : తెలంగాణలో భానుడి భగభగలు, మార్చిలోనే.. మే ఎండలు
పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. దీనికితోడు రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది.
- bheemraj
- Published On : March 31, 2022 / 01:06 PM IST
Sun
Severe suns in Telangana : తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మార్చిలోనే .. మే ఎండలను తలపిస్తున్నాయి. బయట అడుగుపెడితే .. భానుడు భగభగ మండిపోతూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. దీనికితోడు రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. దీంతో పాఠశాల విద్యాశాఖ అలర్ట్ అయ్యింది. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడివేళలు తగ్గించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు .. ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో.. ఇప్పుడు ఈ సమయాన్ని మరింత తగ్గించింది.. విద్యాశాఖ. విద్యార్థులు ఎండ బారిన పడకుండా పాఠశాలలు నేటి నుంచి ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు పనిచేయాలని చెప్పింది. ఈ ఉత్తర్వులు.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లకు వర్తిస్తాయని విద్యాశాఖ తెలిపింది. ఇక ఏప్రిల్ 6 వరకు ఇదే షెడ్యూల్ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
Heat Wave Warning : తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమన్న భానుడు..!
ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఏప్రిల్ 7 నుంచే .. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షా ఫలితాలను 23లోగా విడుదల చేయనున్నారు. ఆ మరునాటి నుంచే అంటే.. ఏప్రిల్ 24 నుంచే సమ్మర్ హాలిడేస్ మొదలు కానున్నాయి. వాస్తవానికి మే నెలలో టెన్త్ విద్యార్థులకు పరీక్షలు ముగిసిన తర్వాత .. వేసవి సెలవులు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించినా.. రోజురోజుకీ ఎండ వేడి పెరిగిపోతుండటంతో .. ఏప్రిల్ 24 నుంచే పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వాలని.. ప్రభుత్వం నిర్ణయించింది.
