Special Trains
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. దీంతో దక్షిణమధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్లపల్లి – తిరుపతి మధ్య 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు. మే 7 నుంచి జూన్ 25 వరకు చర్లపల్లి నుంచి ఎనిమిది స్పెషల్ ట్రైన్లు నడుస్తాయి.
ఆయా రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం 6.50 గంటలకు రైలు బయలుదేరి తదుపరి రోజు ఉదయం 6.55 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఇక మే 8 నుంచి (తిరుగు ప్రయాణంలో) ప్రతిరోజు సాయంత్రం 4.55 గంటలకు రైలు తిరుపతి నుంచి బయలుదేరి తదుపరి రోజు ఉదయం 6 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
మరోవైపు, కాచిగూడ – నాగర్ కోయిల్ స్పెషల్ ట్రైన్లను రైల్వే అధికారులు పొడిగించారు. మే 9 నుంచి జూన్ 6 వరకు కాచిగూడ – నాగర్ కోయిల్ మధ్య 5 స్పెషల్ ట్రైన్లు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో నాగర్ కోయిల్ – కాచిగూడ మధ్య మే11 నుంచి జూన్ 8 వరకు రైళ్లు నడుస్తాయి.