TSRTC Bill : ఆర్టీసీ బిల్లుపై కొనసాగుతున్న సస్పెన్స్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్ తమిళిసై, ఆందోళనలో ఉద్యోగులు

కొందరు దురుద్దేశంతో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజలకు గవర్నర్‌ విజ్ఞప్తి చేశారు. TSRTC Bill - Tamilisai Soundararajan

TSRTC Bill - Tamilisai Soundararajan (Photo : Google)

TSRTC Bill – Tamilisai Soundararajan : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన టీఎస్ ఆర్టీసీ బిల్లుపై సస్పెన్స్ కొనసాగుతోంది. చివరి నిమిషంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ నెల 11న గవర్నర్ ఆమోదం కోసం ఆర్టీసీ బిల్లును ప్రభుత్వం పంపగా.. ఆర్టీసీ బిల్లుపై న్యాయ సలహా కోరారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.

ఆర్టీసీ బిల్లుతో పాటు మరో 4 బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపారు గవర్నర్. బిల్లులపై తాను చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా? అని ఆరా తీశారు. న్యాయశాఖ కార్యదర్శి సిఫార్సుల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

Also Read..Telangana Congress: బీఆర్‌ఎస్, బీజేపీ టార్గెట్‌గా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌.. పెరిగిన నేతల తాకిడి

కాగా, కావాలని ప్రభుత్వ బిల్లులను నిలువరిస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని రాజ్ భవన్ వర్గాలు తేల్చి చెప్పాయి. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, భవిష్యత్తు కోసమే న్యాయ సలహా కోరుతున్నానని గవర్నర్ తమిళిసై వివరణ ఇచ్చారు. కొందరు దురుద్దేశంతో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజలకు గవర్నర్‌ విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై లేవనెత్తిన 10 అంశాలు ఇవే..

1- ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆర్టీసీకి చెందిన భూములు, ఆస్తుల యాజమాన్యం సంస్థ చేతిలోనే ఉండాలి.

2- ఏపీ పునర్విభజన చట్టానికి తగ్గట్లుగా ఆస్తుల విభజన పూర్తి చేయాలి.

3- ఆర్టీసీ విలీనం అనంతరం ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే పే స్కేల్స్‌, సర్వీస్‌ నిబంధనలు ఉండాలి.

4- ఆరోగ్యపరమైన కారణాల నేపధ్యంలో కార్మికులు విజ్ఞప్తి మేరకు వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలకు అవకాశం ఇవ్వాలి.

5- ఆర్టీసీలో క్రమశిక్షణ చర్యలు చాలా కఠినంగా ఉన్నాయి. ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆ చర్యలు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌ లాగానే ఉండాలి.

Also Read..Serilingampally Constituency: శేరిలింగంపల్లిలో త్రిముఖ పోరు తప్పదా.. బరిలోకి టీడీపీ అభ్యర్థి?

6- విలీనం చేసుకున్న ఉద్యోగులను ఇతర శాఖలకు డిప్యూటేషన్‌ మీద పంపితే వారి స్థాయి, జీతం, పదోన్నతులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు.

7- ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా జీతాలు, ప్రయోజనాలు కల్పించాలి.

8- రెగ్యులర్‌, ఒప్పంద ఉద్యోగులకు సర్వీసులో ఉన్నంత కాలం ఆర్టీసీ ఆసుపత్రుల్లో సేవలు, ప్రభుత్వ ప్రాయోజిత చికిత్సలు, బీమా ప్రయోజనాలను నిర్దిష్ట స్థాయి వరకు ఉమ్మడిగా కల్పించాలి.

9- ఓ ఇండిపెండెంట్ సంస్థకు అప్పగించడం లేదా మరేదైనా పద్ధతిలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చూసుకోవాలి.

10- ఉమ్మడి ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి ఉద్యోగులకు అందాల్సిన బకాయిల చెల్లింపు బాధ్యత ప్రభత్వం తీసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు