kavitha kalvakuntla: ఎమ్మెల్సీ కవితకు గులాబీ బాస్ ఇద్దరి బాధ్యతలు అప్పగించారా? నిజామాబాద్ జిల్లా నాయకులను సమన్వయం చేస్తూ జిల్లా పాలిటిక్స్లో కీలకంగా ఉన్న కవితకు ఆ ఇద్దరి బాధ్యతలే ఎందుకు అప్పగించారు? ఉమ్మడి జిల్లా అంతటా ప్రచారం చేయాలని చూస్తున్న కవిత.. ఆ ఇద్దరు నేతల కోసం ప్రత్యేకంగా ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు?
సిట్టింగ్లకే సీట్లు కేటాయించిన సీఎం కేసీఆర్.. బీఫాంలు అందిస్తూ అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. అహంకారం వీడాలని అందరితో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. కొందరు నేతల గ్రాఫ్, లోకల్లో ఉన్న అసంతృప్తిపై రిపోర్ట్లు తెప్పించుకున్న కేసీఆర్.. ఆ నాయకుల గెలుపుపై ప్రత్యేక శ్రద్దపెట్టారు. ఇందులో భాగంగా జిల్లా మంత్రులకు, ప్రధాన నాయకులకు వారి ప్రచార, గెలుపు బాధ్యతలను అప్పగించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్లోని ఇద్దరు అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఇచ్చారు.
బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాపై కొంత అసంతృప్తి ఉన్నట్టుగా గులాబీబాస్ గుర్తించారు. వారిద్దరి గెలుపు బాధ్యతలను కవితకు అప్పగించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిక కవిత.. వారిద్దరి గెలుపు బాధ్యతలను భుజస్కందాలపై వేసుకున్నారు. జిల్లా నాయకులు అందరితో సమన్వయం చేసుకుంటూ వెళ్తున్న కవిత.. అసంతృప్తులను, అలకబూనిన నేతలను బుజ్జగించి అందరినీ ఒకతాటిపైకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
రెండుసార్లు గెలిచిన షకీల్ అహ్మద్, గణేశ్ గుప్తాపై.. ఈ రెండు స్థానాల ఆశావహుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని కవిత గుర్తించారు. వారిని సముదాయించి పార్టీ లైన్లోకి తీసుకురావాలని కవిత భావిస్తున్నారు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేశారు. అన్ని నియోజకవర్గాలను చుట్టేసి అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని నిర్వహించారు. ఈసారి కూడా జిల్లా నేతల ప్రచార బాధ్యతలను తీసుకోవడంతో పాటు ఈ ఇద్దరి నేతల విషయంలో మరింత దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే సిట్టింగులను ఓడించాలని చూస్తున్న సొంత పార్టీ లీడర్ల జాబితాను కవిత సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే వారిని బుజ్జగించినట్టు తెలుస్తోంది.
Also Read: నమ్మకానికి నిదర్శనం కేసీఆర్, నయవంచనకు నిదర్శనం కాంగ్రెస్- మంత్రి హరీశ్ రావు
జిల్లాలో కొన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కీలక లీడర్ల నుంచి అసమ్మతి ఎదుర్కొన్నారు అభ్యర్దులు. విభేదాల కారణంగానే ఈ విధంగా జరిగినట్లు తెలుసుకున్న కవిత… తనదైన శైలిలో అందరినీ కలుస్తూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా సమన్వయం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీని అంటుపెట్టుకొని ఉండి అవకాశాలు రాని చాలా మంది లీడర్లు చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సిట్టింగ్లపై అసమ్మతి రాగం అందుకున్నారు. వారికి ఇతర పదవుల హమీలు ఇచ్చి అభ్యర్దుల విజయానికి కృషి చేసేలా ప్లాన్ సిద్దం చేశారు కవిత.
Also Read: స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నానన్న కాంగ్రెస్ నేత.. మద్దతు ఇస్తానని నాగం జనార్దన్ ప్రకటన
రాష్ట్రవ్యాప్తంగా సిట్టింగులపై అసంతృప్తితో ఉన్న ఆశావహులను, సీటు కోల్పోయిన సిట్టింగుల అసమ్మతిని తొలగిస్తూ వస్తున్నారు కేసీఆర్. ఒకపక్క కేటీఆర్ ఇలాంటి లుకలుకలను సరిచేస్తూ బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయానికి ఇబ్బంది లేకుండా సంప్రదింపులు జరుపుతున్నారు. కవిత కూడా జిల్లా నేతల మధ్య విభేదాలను గుర్తించి వారిని ఒకతాటి పైకి తెచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కేసీఆర్ అప్పగించిన బోధన్, నిజామాబాద్ అర్బన్ స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.