CPM Candidates List Released: 14 మందితో సీపీఎం అభ్యర్ధుల జాబితా విడుదల.. పాలేరు బరిలో తమ్మినేని వీరభద్రం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగనుంది. ఈ మేరకు 14 మందితో తొలి విడుత జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం విడుదల చేశారు. తమ్మినేని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
- Harishth Thanniru
- Published On : November 5, 2023 / 09:58 AM IST
Tammineni Veerabhadra
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సీపీఎం అభ్యర్ధుల తొలి జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. మొదటి జాబితాలో 14 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఖరారు చేసింది. కాంగ్రెస్ తో పొత్తు చర్చలు విఫలం కావడంతో ఆ పార్టీ అధిష్టానం ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 14 మందితో తొలి విడుత జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం విడుదల చేశారు. తమ్మినేనిసైతం ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరో మూడు స్థానాలకు అభ్యర్ధులను ఆదివారం సాయంత్రం ప్రకటించే అవకాశం ఉందని తమ్మినేని తెలిపారు.
Also Read : Vijayasai Reddy : పురందేశ్వరిపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి
తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంపై ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రోజూ మాతో సంప్రదింపులు జరుపుతున్నారని, కానీ నియోజకవర్గాల కేటాయింపు విషయంపై స్పష్టత ఇవ్వకుండా వాయిదా వేస్తున్నారని తమ్మినేని అన్నారు. అంతేకాక.. రోజురోజుకు మేముకోరిన సీట్లను తగ్గించుకుంటూ వస్తున్నారని తెలిపారు. మొదట పాలేరు, మిర్యాలగూడెం నియోజకవర్గాలు సీపీఎంకు కేటాయిస్తామని చెప్పారని, ఆ తరువాత పాలేరు సాధ్యం కాదన్నారు. భద్రాచలం నియోజకవర్గాన్నికూడా మాకు కేటాయించలేదని, వాళ్లే ఇస్తామన్న వైరా నియోజకవర్గంనుకూడా ఇవ్వమని చెప్పారని తమ్మినేని అన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తికావస్తుందని, ఈ క్రమంలో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లు తమ్మినేని చెప్పారు.
మూడు నినాదాలతో ఈ ఎన్నికలకు వెళ్తున్నామని తమ్మినేని చెప్పారు. వాటిలో సీపీఎంకు అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఇవ్వాలి. వామపక్ష పార్టీలను బలపర్చాలి. బీజేపీ దుర్మార్గ పాలనకు స్వస్తి పలకాలి. ఈ మూడు నినాదాలతో ఎన్నికలకు వెళ్తున్నామని, ఈ ప్రక్రియ భాగంగా కాంగ్రెస్, సీపీఐ పొత్తుఖరారై.. సీపీఐ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీచేస్తే.. అక్కడ సీపీఐ అభ్యర్ధికి తాము మద్దతు ఇస్తామని తమ్మినేని స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో.. ఆ పార్టీని ఓడించేందుకు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న ఏ పార్టీకైనా తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తమ్మినేని అన్నారు.
నియోజకవర్గాల వారిగా అభ్యర్ధులు..
పాలేరు – తమ్మినేని వీరభద్రం
ఖమ్మం – ఎర్ర శ్రీకాంత్
సత్తుపల్లి (ఎస్సీ) – మాచర్ల భారతి
భద్రాచలం (ఎస్టీ) – కారం పుల్లయ్య
అశ్వారావుపేట (ఎస్టీ) – పిట్టల అర్జున్
మధిర (ఎస్సీ) – పాలడుగు భాస్కర్
వైరా (ఎస్టీ) – భూక్యా వీరభద్రం
మిర్యాలగూడ – జూలకంటి రంగారెడ్డి
నకిరేకల్ (ఎస్సీ) – బొజ్జ చినవెంకులు
భువనగిరి – కొండమడుగు నర్సింహా
జనగాం – మోకు కనకారెడ్డి
ఇబ్రహీంపట్నం – పగడాల యాదయ్య
పటాన్ చెరు – మల్లికార్జున్
ముషీరాబాద్ – దశరథ్
