Telangana Assembly Sessions 2024 : కాళేశ్వరం, గోదావరి జలాలపై చర్చకు మేం సిద్ధం.. కేసీఆర్ సభకి వచ్చి చర్చలో పాల్గొనాలి : సీఎం రేవంత్
అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన భాషపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Harishth Thanniru
- Published On : February 14, 2024 / 01:03 PM IST
Telangana Assembly 2024
Revanth Reddy : అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన భాషపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కాళేశ్వరం, గోదావరి జలాలపై చర్చకు మేం సిద్ధం.. రేపు సాయంత్రం వరకైనా సమయం ఇస్తున్నాం.. కేసీఆర్ సభకు వచ్చి చర్చలో పాల్గొనాలి.. కేసీఆర్ కు నిజాయితీ ఉంటే సభకి వచ్చి చర్చ చేయాలని అంటూ రేవంత్ అన్నారు. సీఎం హోదాలో ఉన్న తనపై కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సబబా అంటూ రేవంత్ ప్రశ్నించారు.
కేసీఆర్ నన్ను చంపుతారా అంటుండు.. ఎవరికి అవసరం.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే కేసీఆర్ ను చావుదెబ్బ కొట్టారు.. చచ్చిన పామును ఇంకా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంటూ రేవంత్ అన్నారు. సానుభూతికోసం కేసీఆర్ వీల్ చైర్ నాటకాలు, వీధి నాటకాలు ఆడుతున్నాడని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ అవినీతికి పాల్పడకపోతే.. మీరు చెప్పినట్లు మేడిగడ్డ బ్యారేజీలో రెండోమూడో పిల్లర్లు కుంగిపోతే.. దానిపై తీసుకోవాల్సిన నిర్ణయాలమీద చర్చ జరపడానికి మాజీ సీఎం కేసీఆర్ సభలోకి రావాలి.. సభకు రాకుండా పారిపోయి అక్కడేందో ప్రగల్భాలు ఏమిటి..? సభకు కేసీఆర్ రావాలి.. మీరు చెబుతున్న అంశాలపై చర్చ చేద్దాం అంటూ రేవంత్ అన్నారు. ఎలాగూ సభలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. మీరు ఏంఏం చర్చ చేయదల్చుకున్నారో శ్వేతపత్రం సందర్భంగా చర్చ చేద్దాం.. కాళేశ్వరంపై చర్చ అంటారా? దానికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని కాళేశ్వరం పై చర్చ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ సీఎం రేవంత్ అన్నారు. అయితే, సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి సభలో మాట్లాకూడని భాష మాట్లాడటం సరికాదంటూ కడియం అన్నారు.
Also Read : కోటి ఎకరాలకు నీళ్లు.. పచ్చి అబద్దం- కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
అంతకుముందు సభలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంను మార్చాలనే ఆలోచన సరైనది కాదని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను ఎవరూ చెరపలేరని అన్నారు. కొత్త సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం ఇలా ఎదైనా కేసీఆర్ సృష్టించినవే..వీటిని చెరిపేయడం ఎవరి వల్ల కాదున్నారు. కాకతీయ రాజులను గౌరవించండి.. కాకతీయ రాజుల వల్లే చెరువులు, నీటిపారుదల రంగం ఇంకా చెక్కుచెదరకుండా ఉందిన కడియం అన్నారు. కోమటిరెడ్డి రాజోగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక మంత్రిని కూర్చో అని కేటీఆర్ బెదిరిస్తున్నారు. ఇంకా మంత్రి అనే భావనలో కేటీఆర్ ఉన్నాడు.. నేను మంత్రిని అవుతానో లేదో మా ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు.. మీకెందుకు ఇబ్బంది అంటూ ప్రశ్నించారు.
