×
Ad

Telangana : గణేశ్ నిమజ్జనోత్సవం పూర్తయ్యాక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల చివరివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వార్షిక బడ్జెట్ సమావేశాలు ముగిసి ఆర్నెళ్లు కావొస్తుండటంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తప్పనిసరిగా మారింది.

  • Published On : September 6, 2021 / 12:34 PM IST

Assembly

Telangana Assembly sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల చివరివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వార్షిక బడ్జెట్ సమావేశాలు ముగిసి ఆర్నెళ్లు కావొస్తుండటంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తప్పనిసరిగా మారింది. సెప్టెంబర్ 25 లోపు ఉభయసభలు సమావేశం కావాల్సి ఉంది. దీంతో గణేశ్ ఉత్సవాల అనంతరం ఉభయ సభలు సమావేశమవనున్నట్లు తెలుస్తోంది.

వార్షిక బడ్జెట్ సమావేశాలు మార్చి 26న ముగిశాయి. అప్పట్నుంచి ఆర్నెళ్ల లోపు అంటే ఈ నెల 25వ తేదీ లోపు శాసనసభ, మండలి తిరిగి సమావేశం కావాల్సి ఉంది. జూన్ ఒకటో తేదీన ఉభయసభలను ప్రొరోగ్ చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్​ సమావేశమయ్యేందుకు నోటిఫికేషన్ జారీపై సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఢిల్లీ నుంచి తిరిగివచ్చాక సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ నెల పదో తేదీ నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గణేశ్ నిమజ్జనం పూర్తయ్యాకే సమావేశాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ లెక్కన ఈ నెల నాలుగో వారం ఆరంభంలో అసెంబ్లీ, మండలి సమావేశమయ్యే అవకాశం ఉంది. వారం నుంచి పది రోజుల పాటునిర్వహించే అవకాశం ఉంది.

అసెంబ్లీ సమావేశాల్లో దళితబంధుతో పాటు ఇతర అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ఉభయసభల ఆమోదం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.