Raja Singh: పాత సామాను బయటకు పోతేనే..! సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ సెన్సేషనల్ కామెంట్స్
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
- Harishth Thanniru
- Published On : March 13, 2025 / 11:57 AM IST
Raja Singh
Raja Singh: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలంటూ వ్యాఖ్యానించారు. కొన్నాళ్ల నుంచి రాజాసింగ్ పార్టీలో సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు అరుదుగా హాజరవుతున్నారు. ఇటీవల జిల్లా అధ్యక్షుల ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. తాజాగా.. సొంత పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు.
తెలంగాణలో నిజాం పాలనలా కాంగ్రెస్ పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిదో నిజాం లాగా వ్యవహరిస్తున్నారు. హిందువులు పండగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెబుతారా? అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు. ఇదే సమయంలో సొంత పార్టీ నేతలపైనా రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో హిందువులు సేఫ్ గా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. బీజేపీ అధికారంలోకి రావాలంటే తెలంగాణ బీజేపీ నుంచి పాత సామాను బయటకు వెళ్లిపోవాలి. పార్టీ కేంద్ర పెద్దలు దీనిపై ఆలోచన చేయాలని రాజాసింగ్ సూచించారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యమంత్రితో కొందరు సీక్రెట్ మీటింగ్ లు పెట్టుకుంటున్నారు. అలాంటి మీటింగ్ లు పెట్టుకుంటే బీజేపీ అధికారంలోకి వస్తుందా..? పార్టీ కేంద్ర పెద్దలు ఈ విషయాలను గమనించాలి అంటూ రాజాసింగ్ కోరారు.
ఇది నా పార్టీ.. నా అయ్య పార్టీ అనేటోళ్లు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. వాళ్లకు రిటైర్మెంట్ ఇస్తే తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు వస్తాయి. ఇది నేను చెబుతున్న మాట కాదు.. ప్రతిఒక్క బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఇదే అనుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అయితే, సొంత పార్టీ సీనియర్ నేతలపై ప్రస్తుతం రాజాసింగ్ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారాయి.
