CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోనున్న సీఎం కేసీఆర్ అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు.
- Bharath Reddy
- Published On : May 25, 2022 / 09:44 PM IST
Kcr
CM KCR Karnataka tour: తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం బెంగళూరు వెళ్లనున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోనున్న సీఎం కేసీఆర్ అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. కాగా జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు యత్నిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, అందులో భాగంగా జాతీయ స్థాయి నేతలతో పాటు..పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ నేతలతోనూ విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ, పంజాబ్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్..అక్కడ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తోనూ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తోనూ..పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తోనూ భేటీ అయ్యారు.
Other Stories:TSRTC : హైదరాబాద్లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
అయితే ఢిల్లీ పర్యటనను రెండు రోజుల ముందే ముగించుకున్న సీఎం కేసీఆర్..ఉన్నట్టుండి సోమవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం కర్ణాటక పర్యటనను ఖరారు చేసుకున్న సీఎం కేసీఆర్..ఆమేరకు మే 26న బెంగళూరు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా జేడీ(ఎస్) జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడను, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ పార్టీల పాత్ర, ఇతర అంశాలపైనా నేతలు చర్చించనున్నారు. ఈక్రమంలో సీఎం భద్రతా సిబ్బంది ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నారు.
Other Stories:Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
కేసీఆర్ బెంగళూరు పర్యటన సందర్భంగా నగరంలో పలు చోట్ల అభిమానులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన అనంతరం ప్రముఖ సమాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలిసేందుకు మే 27న రాలేగావ్ సిద్ది పర్యటనకు వెళ్తారని ముందుగా భావించినా..ఆ పర్యటన ఖరారు కాలేదు. దీంతో సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. కాగా, గురువారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ..హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈక్రమంలో సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉండేందుకే బెంగళూరు వెళ్తున్నారంటూ తెలంగాణ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
