చలాన్ పడిందా? టపీమని ఆటోమేటిగ్గా మీ అకౌంట్లో డబ్బులు కట్.. కొత్త ప్లాన్..
Traffic challans : నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వాహనాలు నడిపిన వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లపై ఇకపై ఎలాంటి రాయితీలు, డిస్కౌంట్లు ఉండవని రేవంత్ స్పష్టం చేశారు. చలాన్ పడిన వెంటనే వాహనదారుడి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ ప్రతిపాదన చేశారు.
- Harishth Thanniru
- Published On : January 12, 2026 / 10:21 PM IST
Traffic Challan
Traffic Challan : వాహనదారులు నిబంధనలకు విరుద్దంగా వాహనం నడుపుకుంటూ వెళ్తే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తుంటారు.. అయితే, ఆ చలాన్లను మనకు వీలున్నప్పుడు చెల్లించుకునే అవకాశం ఉంటుంది. మరీ ఎక్కువ చలాన్లు పడితే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేస్తుంటారు. అయితే, త్వరలో చలాన్ల వసూళ్ల విషయంలో కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా మీ వాహనంపై చలాన్ పడిన కొద్దిసేపటికే మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి.
హైదరాబాద్ యూసుఫ్ గూడలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనదారులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటు ఆందోళనకరంగా ఉందని, దీనికి మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నపడం వంటి ప్రధాన కారణాలు అని పేర్కొన్నారు. ఇదే సమయంలో పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రతిపాదన చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వాహనాలు నడిపిన వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లపై ఇకపై ఎలాంటి రాయితీలు, డిస్కౌంట్లు ఉండవని రేవంత్ స్పష్టం చేశారు. చలాన్ పడిన వెంటనే వాహనదారుడి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు. ఇందుకోసం వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే యాజమాని బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయాలని రేవంత్ సూచించారు. ఏదైనా నిబంధన అతిక్రమించి చలాన్ పడితే జరిమానా మొత్తం నేరుగా బ్యాంకు ఖాతా నుండి కట్ అయ్యేలా సాంకేతికతను తీసుకురావాలని, ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ట్రాఫిక్ క్రమశిక్షణ అనేది పాఠశాల దశ నుంచే అలవడాలని. విద్యార్థుల సిలబస్లో రోడ్డు భద్రత అంశాలను చేర్చాలని విద్యాశాఖకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే రోడ్డు ప్రమాద రహిత తెలంగాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
రోడ్డు భద్రత విభాగంలో పనిచేయడాన్ని శిక్షగా భావించే ధోరణిని మార్చాలని సీఎం రేవంత్ అన్నారు. ఇకపై ఈ విభాగానికి డీజీ లేదా అడిషనల్ డీజీ స్థాయి అధికారులను నియమించి.. ఈ రంగాన్ని హైడ్రా లేదా సైబర్ క్రైమ్ విభాగాల తరహాలో శక్తివంతంగా మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరిపోవని, మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన రవాణా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.
