cm revanth reddy (2)
CM Revanth Reddy – AP Tour : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో ఏపీకి వెళ్లనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిని దర్శించనున్నారు. కుటుంబంతో సహా రేవంత్ రెడ్డి దుర్గమ్మ దర్శనానికి వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డి కుటుంబం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏపీ పర్యటనకు సంబంధించి తేదీ ఖరారు కావాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇటీవలే తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. పాలనలో రేవంత్ దూకుడు పెంచారు. ఆదిలోనే తన మార్క్ పాలన చూపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆరు గ్యారంటీ పథకాల్లో రెండు గ్యారంటీ పథకాలు అమలు చేశారు.
మహాలక్ష్మీ పథకం, ఉచిత వైద్యం పథకాల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మహాలక్ష్మీ పథకం కింద తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో పాటుగా ఆరోగ్య శ్రీ పథకం కింద రోగులకు రూ.10 లక్షల వరకు వైద్య చికిత్సకు అనుమతి ఇచ్చారు. సీఎంతోపాటు మంత్రులు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కార్యరంగంలోకి దిగారు. మంత్రులకు సచివాలయంలో కార్యాలయాలు కేటాయించడంతో వరుసగా వారు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రులు శాఖల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెబుతున్నారు.