Telangana Congress: కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన వాయిదా.. కారణమేంటి?
తెలంగాణలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని చూసిన కాంగ్రెస్.. అభ్యర్థుల విషయంలో భారీ కసరత్తే చేస్తోంది. తొలి విడత జాబితా వెంటనే ప్రకటించాలని భావించినా..
- Naga Srinivasa Rao Poduri
- Published On : September 6, 2023 / 07:05 PM IST
Telangana congress candidates first list announcement postponed
Telangana Congress Party: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 10నే తొలి జాబితా ప్రకటించి ఎన్నికల సైరన్ మోగించాలని భావించిన హస్తం పార్టీ.. ఆ ఆలోచనను వాయిదా వేసుకుంది. ఇంతకీ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటన ఎప్పుడు ఉండబోతోంది? ఈ వాయిదా కారణమేంటి?
తెలంగాణలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని చూసిన కాంగ్రెస్.. అభ్యర్థుల విషయంలో భారీ కసరత్తే చేస్తోంది. తొలి విడత జాబితా వెంటనే ప్రకటించాలని భావించినా.. ఆల్ ఆఫ్ సడెన్ గా పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ రావడంతో ఆలోచనలో పడింది. దీనికితోడు ఈనెల 16 నుంచి హైదరాబాద్ వేదికగా CWC సమావేశాలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న విడుదల చేయాల్సిన మొదటి విడత జాబితాను అర్ధంతరంగా నిలిపివేసింది.
మొదటి జాబితాలో 35 నుంచి 40 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని హస్తం పార్టీ నిర్ణయించింది. బలమైన నేతలు, సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవాలని భావించారు. కొంతమంది ఎంపీలు కూడా అసెంబ్లీ బరిలో నిలవాలని చూశారు. కేంద్రం ఈసారి జమిలి ఎన్నికలకు వెళ్తే.. అభ్యర్థుల విషయంలో సమీకరణాలు మారే అవకాశముంది. అందువల్లే సెప్టెంబర్ 22 వరకు జాబితాను హోల్డ్ లో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Also Read: ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బండి సంజయ్.. ఏమన్నారంటే?
మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించిన స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల ఎంపికను దాదాపు ఓ కొలిక్కి తీసుకొచ్చింది. పార్టీలోని సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో స్క్రీనింగ్ కమిటీ చర్చలు జరిపింది. ఫైనల్ గా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సర్వేలను కూడా పరిగణలోకి తీసుకుంది.
Also Read: జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం అజరుద్దీన్ గట్టి ప్రయత్నాలు.. విష్ణు పరిస్థితి ఏంటి?
మొత్తంగా 35 నుంచి 40 వరకు సింగిల్ నేమ్తో సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి రెఫర్ చేసింది. మిగతా నియోజకవర్గాల్లో రెండు పేర్లను, అతి సంక్లిష్టంగా ఉన్న నియోజకవర్గాల్లో ముగ్గురు పేర్లను ప్రతిపాదిస్తూ.. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించాలని భావించారు. అయితే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చర్చించి పార్టీలో కొత్తగా చేరే వారి పేర్లను కూడా కేంద్ర కమిటీకి పంపించాలని స్క్రీనింగ్ కమిటీలో నిర్ణయించారు. మొత్తంగా మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశమై పేర్లను ఫైనల్ చేయాలని కమిటీ నేతలు నిర్ణయించారు. అటు పార్లమెంట్ సమావేశాలు, ఇటు CWC మీటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సెప్టెంబర్ 22 వరకు విడుదలయ్యే అవకాశం లేదు.
