Telangana Congress : మూడు పోస్టులతో కొండా సురేఖ లోటు భర్తీ అవుతుందా.? కాంగ్రెస్ ప్లాన్ బూమరాంగ్ అయ్యిందా..!
Telangana Congress : ముగ్గురు బీసీ మహిళలకు పదవులు పంచినా.. సురేఖ లోటు భర్తీ కాలేదన్న చర్చ ఒకవైపు.. కొత్తగా పదవులు దక్కిన నేతల విషయంలో పార్టీలోనే అసంతృప్తి మరోవైపు తెరపైకి రావడంతో హస్తం పార్టీ పెద్దల లెక్క తప్పిందన్న టాక్ నడుస్తోంది.
- Harish Thanniru
- Published on- September 5, 2026 / 09:11 AM IST
Telangana Congress
Telangana Congress : కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించారు. అంతకంటే ముందు ఆమె బీసీ కార్డును తెరపైకి తెచ్చారు. తన పద్మశాలి. తన భర్త మున్నూరు కాపు. మొత్తం 16శాతం ఓటు బ్యాంకు అంటు చెప్పుకొచ్చారు. దీంతో అలర్ట్ అయిన కాంగ్రెస్ పెద్దలు బీసీ కార్డుతో తమకు ఎక్కడ నష్టం జరుగుతుందోనని అదే బీసీ వ్యూహంతో..ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు ఇచ్చారు. కానీ..డ్యామేజ్ కంట్రోల్ కోసం వేసిన ఈ ప్లాన్..ఇప్పుడు కాంగ్రెస్కే బూమరాంగ్ అవుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పదవులు పంచినా.. సురేఖ లోటు భర్తీ కాలేదన్న చర్చ ఒకవైపు.. కొత్తగా పదవులు దక్కిన నేతల విషయంలో పార్టీలోనే అసంతృప్తి మరోవైపు తెరపైకి రావడంతో హస్తం పార్టీ పెద్దల లెక్క తప్పిందన్న టాక్ నడుస్తోంది. సురేఖ స్థానంలో మరో మహిళా నేతను క్యాబినెట్లోకి తీసుకోకుండా..బీసీ మహిళలకు మూడు పోస్టులు ఇవ్వడం కట్టబెట్టడం అసంతృప్తులకు దారితీసిందని అంటున్నారు.
గద్వాల విజయలక్ష్మికి ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ పోస్ట్ కట్టబెట్టడం కాంగ్రెస్లో ఇంటర్నల్ డిస్కషన్కు కారణమవుతుందట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా పనిచేసిన విజయలక్ష్మి..ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. మేయర్ పదవి అలా ముగిసిందో లేదో..మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవి వచ్చింది. అప్పటికే ఆ పోస్ట్లో ఉన్న నేరెళ్ల శారదకు పొడగింపు ఇవ్వకుండా.. ఆమెను గద్వాల విజయలక్ష్మికి ఉమెన్ కమిషన్ ఛైర్ పర్సన్ పదవిని కట్టబెట్టారు. సీనియర్ నేత అయిన చిన్నారెడ్డిని తప్పించి.. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్పర్సన్గా విజయలక్ష్మికి కొత్త బాధ్యతలు ఇచ్చారు.
విజయలక్ష్మి స్థానంలో మళ్లీ నేరెళ్ల శారదకు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవి అప్పగించడం కూడా చర్చకు దారితీస్తోంది. ఏదో పేరుకే పోస్ట్ ఇచ్చినట్లే కానీ.. అప్పుడు రెన్యూవల్ చేయకుండా.. మళ్లీ అదే పోస్ట్ను అటుఇటు ఇప్పి తనకు ఇవ్వడంపై నేరేళ్ల శారద కూడా సంతృప్తిగా లేరని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక గద్వాల విజయలక్ష్మికి ఇప్పుడిచ్చిన ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ పోస్ట్ క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగి ఉంటుంది. ఆమె తండ్రి కే కేశవరరావు ఆల్రెడీ ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ ర్యాంకు పోస్టులో ఉన్నారు. ఇలా కేకే కుటుంబానికి వరుసగా కీలక పదవులు దక్కడంపై కాంగ్రెస్లో మరో చర్చ మొదలైందట. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన సీనియర్లు ఉండగా..అవసరాల కోసం పక్కదారులు చూసి మళ్లీ పార్టీలోకి వచ్చిన వారికి పెద్దపెద్ద పోస్టులు కట్టబెట్టడం ఏంటంటూ గునుక్కుంటున్నారట పలువురు హస్తం పార్టీ నేతలు.
ఇక గుండు సుధారాణి కుడా ఛైర్పర్సన్గా అవకాశం ఇవ్వడం కూడా హస్తం పార్టీలో కుతకుత దారితీసిందని అంటున్నారు. గుండు సుధారాణి గతంలో టీడీపీలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి వరంగల్ మేయర్ పదవి దక్కించుకున్నారు. బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉండి..కాంగ్రెస్ గూటికి చేరారు. కొండా సురేఖను తప్పించడం ద్వారా డ్యామేజ్ జరగకుండా..అదే వరంగల్ జిల్లాకు చెందిన పద్మశాలి వర్గానికి చెందిన గుండు సుధారాణికి కుడా ఛైర్పర్సన్ పదవి కట్టబెట్టారని గుసగుసలు పెట్టుకుంటున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ను బ్యాలెన్స్ చేసేందుకు..పార్టీ కోసం ఏం పనిచేయకున్నా పదవులు ఇస్తారా అంటూ రగిలిపోతున్నారట పలువురు మహిళా కాంగ్రెస్ నేతలు.
కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. బీసీలకు నెగెటివ్ మెసేజ్ వెళ్లకుండా.. సురేఖను తప్పించి ముగ్గురికి మూడు పదవులు ఇవ్వడం..ప్లస్ పాయింట్గా మారకపోగా బూమరాంగ్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. సురేఖ అసంతృప్తి ఒకవైపు..సీనియర్ కాంగ్రెస్ నేతల నిట్టూర్పు మరోవైపు..విజయలక్ష్మికి వరుస పదవులపై చర్చ ఇంకోవైపు..ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతపై మరో వాదన. డ్యామేజ్ కంట్రోల్ కోసం వేసిన స్కెచ్ కాస్త మిస్ ఫైర్ అవుతుందన్న చర్చ నడుస్తోంది.
సురేఖ ప్లేస్లో ముగ్గురు మహిళలకు నామినేటెడ్ పోస్టులతో సరిపెట్టాలనుకున్న ప్లాన్కు పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో..క్యాబినెట్లోకి బీసీ మహిళను తీసుకునే ఆలోచన తెరమీదకు వచ్చిందంటున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ విజయశాంతి పేరు ప్రచారంలోకి వస్తోంది. సురేఖను తప్పించారు కాబట్టి..ఆమె స్థానంలో మరో మహిళా నేతను మంత్రివర్గంలోకి తీసుకుంటే..కొంతవరకు బ్యాలెన్స్ అవుతుందన్న చర్చ జరుగుతోందట. మూడు బెర్తుల లెక్క కుదరలేదా.? డ్యామేజ్ కంట్రోల్ కోసం వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా కాలేదా అనేది రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ కానుంది.
